దర్శకుడిగా కరణ్ జోహార్ బ్లాక్ బస్టర్ ప్లాన్?

Karan Johar: బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ నుంచి ఇటీవల వరుసగా చిత్రాలు విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ దర్శకుడిగా రంగప్రవేశం చేయనున్నారు. తన బ్లాక్ బస్టర్ ‘కభీ ఖుషీ కభీ గమ్’కు సీక్వెల్ తీయాలని ఆలోచిస్తున్నారు.
బాలీవుడ్లో దర్శకుడిగా ఎంతో విజయవంతమైన ఇమేజ్ కలిగిన కరణ్ జోహార్ నిర్మాతగా మాత్రం ఇటీవల కష్టకాలం ఎదుర్కొంటున్నారు. దర్శకుడిగా ఘనవిజయాలు సాధించిన ఆయన 2023 నుంచి దర్శకత్వానికి దూరంగా ఉన్నారు. ఇటీవల వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో ధర్మా ప్రొడక్షన్స్ ఆర్థికంగా ఇబ్బందులు పడింది. 2024లో ‘కిల్’ తర్వాత హిట్ లేకపోవడం, 2025లో ‘కేసరి చాప్టర్ 2’ నుంచి ‘తు మేరీ మే తేరా’ వరకు వరుస ఫ్లాప్లు ఎదురవడంతో పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ మళ్లీ మెగాఫోన్ పట్టాలని నిర్ణయించారు. 2001లో కరణ్ డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్, షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ రిలీజ్ అయి కల్ట్ క్లాసిక్గా నిలిచింది. ఆ చిత్రం అప్పట్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ తీయాలని కరణ్ ఆలోచిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని, ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.



