తెలంగాణ

Telangana: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు

Telangana: కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకుంది. కీలక పథకాలు, ప్రాజెక్టుల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తారని ఆశిస్తోంది. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. పలు భారీ పథకాలకు సాయం చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్ రిజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, మెట్రో విస్తరణ, స్కిల్స్, స్పోర్ట్స్‌ వర్సిటీలు, ఫ్యూచర్‌ సిటీ.. వంటి పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణ కోసం చేపడతామని చెప్పిన ప్రాజెక్టులకు కూడా నిధులు ఇవ్వాలని రేవంత్ సర్కారు డిమాండ్ చేస్తోంది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే పలు పనులకు 14 వేల కోట్లు అవసరమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి దశలవారీగా నిధులు ఇవ్వాలని కోరుతోంది.

గ్రేటర్‌ హైదరాబాద్‌కు భవిష్యత్తులో తాగునీటి అవసరాలు తీర్చేందుకు, మూసీలో శుద్ధమైన జలాల ప్రవాహంతో నగర వాసుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చేందుకు నిధులు అవసరం అని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది.హైదరాబాద్ నగరంతో ఆర్‌ఆర్‌ఆర్‌కు అనుసంధానం చేస్తూ చేపట్టే రేడియల్‌ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు కావాలని రేవంత్ సర్కారు ప్రతిపాదనలు పంపింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ నలుమూలలకు మెట్రోరైలు విస్తరణ కోసం నిధులు కావాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. దీని వల్ల ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందని వివరించింది.

స్కిల్స్‌ యూనివర్సిటీకి సహకారం, మూలధన వ్యయం కోసం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీలో తెలంగాణకు నిధుల పెంపు, సింగరేణి కాలరీస్‌కు కొత్త బ్లాక్‌ల కేటాయింపు, స్మార్ట్‌ సిటీ మిషన్, సర్వేలు పూర్తయి ఉన్న 30 రైల్వే లైన్లకు నిధులు, గృహజ్యోతి పథకాన్ని ముఫ్త్‌ బిజిలీ యోజనకు అనుసంధానం, కొత్త నవోదయ పాఠశాలలు, నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ ఏర్పాటుకు సహకారించాలని రాష్ట్రం కోరుతుంది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు పెంచాలని కోరుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రాంటుగా 13వేల179 కోట్లు రాగా.. 2023-24లో 41వేల259 కోట్లు వస్తాయని బడ్జెట్‌లో అంచనా వేశారు. కానీ.. రూ.9,730 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో పలు పథకాలకు నిధులు కేటాయించలేదు. గతేడాది దాదాపు 76 శాతం గ్రాంటుల్లో కోత పడింది. దీంతో 2024-25 తెలంగాణ బడ్జెట్‌లో కేంద్రం నుంచి వచ్చే గ్రాంటును 21వేల 636 కోట్లుగా చూపారు. కానీ గత 9 నెలల్లో 4వేల771 కోట్లు మాత్రమే వచ్చాయి. మూడు నెలల్లో మరో 5 వేల కోట్లకు మించి రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.గతంలో భారీగా కోత పడిన నేపథ్యంలో.. వచ్చే ఏడాది అన్ని పథకాలకు కలిపి గ్రాంట్లుగా దాదాపు 30 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు చేసే కేటాయింపుల్లో రాష్ట్రానికి ఏ మేరకు నిధులు ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న కొత్త రైల్వే మార్గాల ప్రాజెక్టులు, రైళ్లు, అదనంగా లైన్ల నిర్మాణానికి 83 వేల 543 కోట్లు అవసరం ఉంది. ఇవి కాకుండా మరిన్ని రైళ్లు, ప్రాజెక్టులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కోరుతోంది. బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి విన్నవించింది. ఇప్పటివరకూ అనుసంధానం లేని 9 జిల్లా కేంద్రాలకు రైలు మార్గం నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులూ కేంద్రాన్ని కోరుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి నిధులు రాకపోతే.. ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులకు డబ్బుల కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button