Newsక్రీడలు

ఫాలో ఆన్ గండం తప్పించిన ఆకాశ్ దీప్, బుమ్రా.. డ్రా దిశగా గబ్బా టెస్టు..!

హమ్మయ్య గబ్బా టెస్టులో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. ప్రధాన బ్యాటర్లలో చాలా మంది ఇబ్బంది పడ్డా.. టెయిలెండర్లు ఆకాశ్ దీప్ (27), జస్‌ప్రీత్ బుమ్రా (10) భారత్‌ను ఆదుకున్నారు. అబేధ్యమైన పదో వికెట్‌కు ఈ జోడీ 39 పరుగులు జోడించింది. దీంతో భారత్ ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. నాలుగో రోజు ఆటకు కూడా వర్షం పదేపదే అంతరాయం కలిగించింది. ఇక చివరకు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను త్వరగానే ముగించారు. దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది.

ఓవర్‌ నైట్ స్కోరు 51/4తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌‌.. కాసేపటికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 74 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పదా అనిపించింది. కానీ కేఎల్ రాహుల్ (84), రవీంద్ర జడేజా (77) పోరాడటంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. కానీ 141 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔట్ అయ్యాడు. నితీశ్ కుమార్ రెడ్డి (16) కూడా త్వరగానే ఔట్ కావడంతో 194 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఫాలో ఆన్ గండం దాటాలంటే ఇంకా 52 పరుగులు అవసరం.


ప్రధాన బ్యాటర్లంతా ఔట్ కావడంతో ఇక ఫాలో ఆన్ తప్పదని అంతా భావించారు. కానీ ఆకాశ్ దీప్, బుమ్రా అద్భుతం చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. అబేధ్యమైన పదో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. దీంతో ఫాలో ఆన్ గండం దాటాలంటే అవసరమైన 246 పరుగుల మార్కును భారత్ దాటింది. దీంతో భారత శిబిరంలో నవ్వులు పూశాయి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న హెడ్ కోచ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు గండం గట్టెక్కింది అన్నట్లుగా లుక్ ఇచ్చారు.


ప్రస్తుతం భారత్ స్కోరు.. 252/9గా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా ఇంకా 193 పరుగులు వెనకబడి ఉంది. ఇప్పటికే నాలుగు రోజుల ఆట పూర్తికాగా.. చివరి రోజు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను ఆలౌట్ చేసి.. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగాల్సి ఉంది. అప్పుడు భారత్‌కు లక్ష్యాన్ని నిర్దేసిస్తుంది. కానీ సుమారు 95 ఓవర్ల ఆటలో ఇవన్నీ సాధ్యమవుతాయా అనేది అనుమానమే. దీంతో ఈ టెస్టు డ్రా అవుతుందని అంచనాలు ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button