టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

Mullapudi Brahmanandam: తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు సినీ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఆయన కుమారుడు రాగానే బుధవారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దివంగత ఈవీవీ సత్యనారాయణకు సన్నిహిత బంధువైన ముళ్లపూడి, ఆయన సహకారంతోనే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.ముళ్లపూడి బ్రహ్మానందం తన నిర్మాణ సంస్థ ద్వారా ‘నేను’, ‘అల్లుడుగారు వచ్చారు’, ‘మనోహరం’, ‘ఓ చిన్నదానా’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. తెలుగు సినిమా సర్కిల్లో ఆయనది ప్రత్యేక గుర్తింపు.
ఆయన మృతి వార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు షాక్కు గురయ్యారు. సినీ రంగంలో ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషి మరువలేనిదని పలువురు కొనియాడారు. ఆయన ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముళ్లపూడి కుటుంబానికి సినీ తారలు, నిర్మాతలు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన లేని లోటు తెలుగు సినిమాకు తీరనిదని అంటున్నారు సన్నిహితులు.