Actres Pratyusha: ప్రత్యూష మృతి కేసు.. సుప్రీంకోర్టులో తీర్పు రిజర్వ్!

Actress Pratyusha: తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ప్రత్యూష మృతి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2002లో జరిగిన ఈ దుర్ఘటనపై నిందితుడు సిద్ధార్థరెడ్డి, మృతురాలు తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన అప్పీళ్లపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
2002 ఫిబ్రవరి 23న హైదరాబాద్లో పురుగుమందు తాగి ప్రత్యూష మరణించగా, సిద్ధార్థరెడ్డి బతికి బయటపడ్డాడు. ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు ట్రయల్ కోర్టు సిద్ధార్థ్కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హైకోర్టు దానిని 2 ఏళ్లకు తగ్గించి రూ.50 వేల జరిమానా విధించింది. ఈ రెండు తీర్పులనూ సవాల్ చేస్తూ రెండు వైపులా సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం బుధవారం విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ చేసింది.
నిందితుడి తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, ఎల్.నరసింహారెడ్డి వాదనలు వినిపించారు. ఇద్దరూ కలిసి పురుగుమందు సేవించారని, ఆత్మహత్యకు ఉసిగొల్పినట్లు నిరూపితం కాలేదని వారు పేర్కొన్నారు. అయితే ప్రత్యూష తల్లి సరోజినీదేవి మొదటి నుంచీ దీన్ని హత్యగానే పరిగణిస్తూ శిక్ష పెంచాలని కోరుతున్నారు.



