Harish Rao: సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి

Harish Rao: తెలంగాణ వ్యాప్తంగా రైతులకు అందించిన రైతు భరోసాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం రైతు భరోసా విజయోత్సవ సభలను ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం హైదరాబాద్లోని సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్గాంధీ విగ్రహ ప్రాంగణంలో సభను నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే రైతు భరోసా విజయోత్సవ సభలపై మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ప్లాట్ఫాం X వేదికగా ట్వీట్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసాపేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు. 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు 15 వేల చొప్పున ఇస్తామని చెప్పి.. 12 వేలకే పరిమితం చేయడం మోసం చేయడమేనన్నారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత అంటూ ఫైర్ అయ్యారు హరీష్ రావు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టారని.. అధికారంలోకి వచ్చాక నిండా ముంచావు, రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి అంటూ ప్రశ్నించారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న కాంగ్రెస్ జిమ్మిక్కులను రైతులు నమ్మరని అన్నారు. రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలని.. ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.