BJP: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు

BJP: ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇక నుంచి మరో లెక్క అంటోంది తెలంగాణ బీజేపీ. రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి కసరత్తు చేస్తుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని కమల పెద్దలు ఊవ్విళ్లూరుతున్నారు. వచ్చే ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. అధికారం కోసం కదనరంగంలోకి దూకుతూ వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ఆ జిల్లా నుంచే క్రమక్రమంగా బలాన్ని పెంచుకుంటుందట. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడ..? బీజేపీ వ్యూహాం ఏంటి..?
హిందువులు పవిత్రంగా భావించే రామాయణ పర్వాల్లో ఖమ్మం జిల్లా సువర్ణాక్షరాలతో పరిడవిల్లుతుంది. అటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక ఎన్నికలపై కమలం పార్టీ పట్టు కోసం అడుగులు వేస్తోంది. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా హై కమాండ్ వ్యూహాలు రచిస్తుంది.
పార్టీలోని సీనియర్ నాయకులను అలర్ట్ చేస్తూనే కొత్త వారిని పార్టీ లోకి తీసుకోవడంపై ఫోకస్ చేశారు. రాష్ట్ర స్థాయి నేతలు ఖమ్మం జిల్లా నేతలతో తరచు సమావేశాలు నిర్వహిస్తూ బలాబలాలను తెలుసుకుంటున్నారు. నియోజకవర్గాల్లో బీజేపీ పరిస్థితి, బీఆర్ఎస్ బలహీనతలు, కాంగ్రెస్ ప్రాబల్యంపై ఇప్పటికే రెండు సార్లు సర్వేలు నిర్వహించారు.
మరోవైపు.. బీఆర్ఎస్ లో ఇమడలేక పార్టీ నుంచి బయటకు వస్తున్నవారిపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తమ పార్టీలోకి రావాలంటూ కొందరిని ఆహ్వానిస్తున్నట్టు మరికొందరిపై ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ, టీడీపీ పొత్తులుంటాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అయితే ఖమ్మం జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేపట్టే విషయంలో పార్టీలో ఐక్యత కనిపించడం లేదట. దీంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.
దాంతో పాటు ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీజేపీకి ఖమ్మంలో అంతకంతకూ ఓటింగ్ పెరుగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీజేపీకి లేని ఫామ్ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఏడు నియోజకవర్గాల్లో 1 లక్షా 20వేల ఓట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవకపోయినా.. బీజేపీ తన ప్రభావం చూపింది. ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో పనిచేసేలా బీజేపీ హై కమాండ్ దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం చేస్తోంది.
సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ హై కమాండ్ భావిస్తోందట. ఆ దిశగా జిల్లాలో అడుగులు వేస్తోంది. ఇందుకోసం ద్వితియ స్థాయి నేతలతో సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో బీజేపీ అగ్ర నేతలు పాల్గొనాలని హై కమాండ్ ఆదేశించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని చెబుతోంది.
ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో ప్రజల్లో బలం ఉన్న నేతలను బీజేపీలో చేర్చుకునేలా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు బాధ్యతలు అప్పగించింది. అలాగే జిల్లాలో కాంగ్రెస్ అసంతృప్తి నేతలకు బిజెపి గాలం వేస్తుంది. తమ పార్టీలోకి వస్తే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని పంచాయితీ పోరుకు అన్ని తామై చూసుకుంటామని కషాయం పార్టీ హామీ ఇస్తుందట. గెలుపుకు కావాల్సిన సరంజామ హామీతో కమలం ఇతర పార్టీ నాయకులకు తనవైపుకు లాగేసుకుంటుందన్న టాక్ వినిపిస్తుంది.
కాగా.. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో బీజేపీకి క్యాడర్, కార్యకర్తలు లేరనేది జగమెరిగిన సత్యం. దీంతో అధికార పార్టీ అసంతృప్తి నేతలపై ఫోకస్ చేస్తుందట. ఎలాగైనా జిల్లాలో తమ పార్టీ ప్రతిష్టను పెంచుకునేందుకు ఊవిళ్ళురుతుందట. మరోవైపు BRSతో అంటకాగిన నేతలు పార్టీని వీడి బీజేపీ వైపు అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
పార్టీ బలోపేతం కోసం అటు బిజెపి సైతం జిల్లాకు పరిశీలకులను పంపిందట. వారు వివిధ పార్టీల్లో ఉన్న అసంతృప్తి నేతలు నాయకులను తమ వైపు మళ్ళించుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒక జిల్లాలో ఆయా పార్టీలకు ఉన్న బలాలు, బలహీనతలను బేజీరు వేసుకుంటూ బిజెపి నిశితంగా పరిశీలిస్తూ.. పార్టీలకు వచ్చే నేతలకు పెద్దపీట వేసేందుకు సిద్ధమైందట.
కాగా.. గత GHMC ఎన్నికల నుండి తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతూ వస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ పార్టీ చేసిన కొన్ని తప్పుల వల్ల అధికారంలోకి రాలేకపోయామని ఇప్పటికీ కమలం పార్టీ కార్యకర్తలు చెబుతుంటారు. అప్పుడు కేవలం 8 ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకున్నారు. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు 35 శాతం ఓటు బ్యాంకుతో తెలంగాణలో బీజేపీ సత్తా చాటింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడు సీట్లకు గాను రెండు సీట్లు గెల్చుకుంది. అంటే తెలంగాణలో పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయని కేడర్ అనుకుంటోందట.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు బిజెపి అడుగులు వేస్తోంది. అధికార దర్పం ప్రదర్శించిన బిఆర్ఎస్ నేతలు సైతం బిజెపి వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వినిపిస్తున్నాయ్. స్థానిక సంస్థల్లో అభ్యర్థులు గెలుపు కోసం అటు టిడిపి తో పాటు బిజెపికి పరోక్షంగా సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే బీజేపీ సహితం మండల స్థాయి గ్రామస్థాయి కమిటీలను పటిష్ఠం చేసేందుకు ఉపక్రమించిందట.
దీంతో పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు బిజెపి తన ఖాతాలో వేసుకునేందుకు పావులు కదుపుతుంది. ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న తరుణంలో అధికార పార్టీ నేతలు మౌనం వహించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ మౌనం వెనుక ఆంతర్యం పొమ్మనలేక పొగ పెడుతున్నట్ల..? లేక పరోక్షంగా ఆ పార్టీకి పట్టం కట్టేందుకా..? అనే విమర్శలు సైతం లేకపోలేదు.
మొత్తానికి బలమైన నేతలను బీజేపీలో చేర్చుకోవడం వల్ల పార్టీ బలపడుతుందని హై కమాండ్ భావిస్తోంది. నేతలు కలిసికట్టుగా పని చేయాలని 2028 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయమే లక్ష్యంగా నేతలు ముందుకు వెళ్లాలని హై కమాండ్ సూచిస్తుంది. స్థానిక ఎన్నికల్లో బీజేపీ మీద అభిమానం ఉండే సానుభూతిపరులను పార్టీని గెలిపించేలా పావులు కదుపుతున్నారట. ఈ సారి ఖమ్మం నుంచి ప్రభావం చూపించేలా బీజేపీ హై కమాండ్ వ్యూహం రచిస్తోంది. మరి బిజెపి వ్యూహం ఫలిస్తుందా లేదా వేచి చూడాలి.