ఆంధ్ర ప్రదేశ్

Flight Services: విజయవాడ నుంచి విశాఖకు నూతన విమాన సర్వీసు

Flight Services: కూటమి ప్రభుత్వంలో ఫ్లైట్ పాలిటిక్స్ నడుస్తున్నాయా..! నేతల మధ్య విమాన జగడం ముదురుతోందా..! కూటమి ఎమ్మెల్యేల మాటల్ని ఆ కేంద్రమంత్రి సీరియస్‌గా తీసుకున్నారా..! ఫ్లైట్ సర్వీసులు పునరుద్దరించి తన సత్తా ఏంటో చూపారా..! విమర్శించిన వాళ్ల నోళ్లు మూయించారా..! ఇంతకూ ఎవరా నేతలు..? ఏపీలో విమాన రాజకీయాల వెనుక ఉన్న కథ ఏంటి.. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…

ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వైజాగ్ నుంచి విజయవాడకు విమాన సర్వీసును పునరుద్దరించారు. వచ్చే నెల నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దీంతో చాలా మందికి ఊరట లభించనుంది. విజయవాడ, విశాఖపట్నం మధ్య విమాన సర్వీస్ జూన్ 1 నుండి తిరిగి ప్రారంభమవుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.

ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌ రవాణా అనుసంధానంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్ర రాజధానిలోని విజయవాడను ఆర్థిక కేంద్రమైన విశాఖపట్నంతో ఇది కలుపుతుందని ట్వీట్ చేశారు. ప్రాంతీయ విమాన కనెక్టివిటీని బలోపేతం చేయడమనే తమ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రయాణీకుల సౌలభ్యం కోసం, రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా ఈ కీలకమైన విమాన సేవ మళ్లీ ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. అయితే కూటమి ఎమ్మెల్యేల విమర్శలు, రాజకీయ దుమారం తర్వాత మళ్లీ విమాన సర్వీసులు మొదలు కావడంపై రాజకీయా వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నుంచి విజయవాడ, తిరుపతికి వెళ్ళడానికి రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. అయితే ఆకాశ మార్గం లేదు. ఎయిర్ పోర్టులు ఉన్నా విమానాలు అందుబాటులో లేవు. విజయవాడకు గానీ, తిరుపతికి గానీ, ఇతర ప్రాంతాలకు గానీ నేరుగా ఫ్లైట్లు లేవు. దీంతో విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లాలన్నా హైదరాబాద్ వెళ్లి మళ్లీ విజయవాడ రావాల్సి వచ్చేది.

దీని వల్ల ప్రయాణం సంగతి సరేసరి. అటు సమయం కూడా వృధా అవుతోందని గతంలో గంటా శ్రీనివాసరావు, అలాగే విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు వాపోయారు. విశాఖకు, విజయవాడకు వెళ్లాలంటే డైరెక్టుగా ఫ్లైట్స్ లేకపోవడం చాలా ఇబ్బందికరమని బాధపడ్డారు.

ఇటు గంటా శ్రీనివాసరావు, అటు విష్ణుకుమార్ రాజు ఇద్దరూ విశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న రెండు పార్టీల నేతలు. ఇద్దరు నేతలు చేసిన వ్యాఖ్యలు కూటమి సర్కారులో కలకలం రేపాయి. విశాఖ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమానాల గురించి హాట్ కామెంట్ చేశారు. విజయవాడకు విమాన కనెక్టివిటీ లేదన్న ఆయన విజయవాడలో పార్టీ మీటింగ్‌లు, ప్రభుత్వ అవసరాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందన్నారు. ఎమ్మెల్యేలను ముఖం మీద అడగలేకపోతున్నారని కానీ వ్యాపార వర్గాలు సహా అందరూ విశాఖను పూర్తిగా వదిలేశారనే అభిప్రాయంతో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరంగా ఉందంటూ మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపాయి. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టులో బయల్దేరితే వయా హైదరాబాద్, గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతోందన్నారు.

విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఇక మంగళవారం వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరడానికి ఇంత దుస్థితంటూ ఆయన పోస్ట్ చేశారు.

ఈ ఇద్దరు విశాఖ నేతల వ్యాఖ్యలతో పౌర విమానయాన మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేశారా అన్నట్టుగా వార్తలు వచ్చాయ్. ఈ మొత్తం వ్యవహారం కూటమి సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. విమానయాన శాఖ మంత్రి కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రామ్మోహన్ నాయుడు ఉండగా ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న వెర్షన్ సర్కారును ఇరుకున పెట్టింది.

కూటమి ఎమ్మెల్యేల విమర్శలు, రాజకీయ దుమారం తర్వాత మళ్లీ వైజాగ్ నుంచి విజయవాడకు విమాన సర్వీసులు మొదలు పెడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. దీంతో విమర్శించిన వాళ్ల నోళ్లకు తాళం వేసినట్లైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి రాజకీయాల సంగతి ఎలా ఉన్నా విశాఖ, విజయవాడ మధ్య విమాన సర్వీసులు పునరుద్దరించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకమీదట ఈ సర్వీసులు ఆగకుండా చూడాలని మరింత కనెక్టివిటీ పెంచాలని కోరుతున్నారు. చూడాలి మరి ప్రజల కోరిక నెరవేరుతుందా లేదా అన్నది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button