తెలంగాణ

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

బీఆర్ఎస్‌కు చెందిన జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు వైద్యులు వెల్లడించారు.

ఈనెల 5న ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఏఐజీకి తరలించారు. కార్డియాక్‌ అరెస్టుకు గురైనట్లు వైద్యులు తెలిపారు. సీపీఆర్‌ చేయడంతో తిరిగి గుండె కొట్టుకోవడం, నాడి, బీపీ సాధారణ స్థితికి రావడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగించారు.

కొన్నాళ్లుగా ఆయన కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మూడు నెలల క్రితం కూడా ఏఐజీలో చేరారు. అప్పట్లో డయాలసిస్‌ చేయించుకున్నట్లు సమాచారం. తాజాగా గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మూడు సార్లు ఎమ్మెల్యేగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్‌ 1982లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో హైదరాబాద్‌ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఎన్టీఆర్ స్వయంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగానూ మాగంటి గోపీనాథ్‌ పనిచేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button