TTD: తిరుమల భద్రతపై టీటీడీ స్పెషల్ ఫోకస్

TTD: తిరుమల శ్రీవారి ఆలయ భద్రతను మరింత పటిష్టం చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా టీటీడీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయం చుట్టూ ఆరు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడా కూడా డ్రోన్ కెమెరాలు ఎగరవేయడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా యాంటీ డ్రోన్ కెమెరా ప్రదేశంగా నిర్ణయిస్తూ ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆరు కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా జామర్లను అమర్చేందుకు టీటీడీ బోర్డు తీర్మానం చేసింది..
హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల భద్రతను పటిష్ఠం చేసేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల క్షేత్రం పరిదిలో ఆరు కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు పనిచేయకుండా జామర్లను అమర్చేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, అక్టోపుస్ అంటూ పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి.
ప్రత్యేకంగా తిరుమలలో 2 వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పసిగట్టే అనలటిక్స్ కలిగిన అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలో వివిధ సముదాయాల వద్ద హై డెఫినేషన్ దృశ్యాలు చిత్రీకరించే నిఘా కెమెరాలను అమర్చింది టీటీడీ.
అలాగే లోతుగా జూమ్ చేసిన వీడియోలలో ఎలాంటి ఫ్రీజర్లు రాకుండా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చారు. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటూ చేశారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయిన టీటీడీ నిఘా విభాగం, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకండ్లలో సమాచారం విజిలెన్స్ విభాగానికి చేరుకునేది.
పిట్ ప్యాకిటింగ్, దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది.
కాగా తరచూ శ్రీవారి ఆలయ గోపురం పై భాగం నుండి విమానాలు హెలికాప్టర్లు అతి తక్కువ ఎత్తులో ప్రయాణిస్తుండడం టీటీడీని ఆందోళనలో పడవేస్తోంది. 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్ గ్యాస్ ప్లాంట్ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్తో శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులను చిత్రీకరించారు. 2024 జనవరిలో హరియాణాకు చెందిన దినేష్ 53వ మలుపు వద్ద డ్రోన్ ఎగురవేసి శ్రీవారి మోకాలు మెట్టు, నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు.
ఇటీవల రాజస్థాన్కు చెందిన యూట్యూబర్ శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించాడు. ఇలా జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్ అధికారులకు తెలపడం వారొచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది.
వరుసగా తిరుమలలో జరుగుతున్న పరిణామాల కారణంగా టీటీడీపై అనేక విమర్శలు వస్తున్నాయి. తిరుమలలో చీమ చిటుక్కుమన్నా అది ఓ సెన్సేషన్ వార్తగా మారుతుంది. దీంతో చిన్న చిన్న తప్పులు జరిగినా సోషల్ మీడియాతో వస్తున్న విసృత ప్రచారం కారణంగా టీటీడీకి పెద్ద తననోపులు తెచ్చి పెడుతున్నాయి. అధునాతన టెక్నాలజీ ఉన్న యాంటీ డ్రోన్ సిస్టం ను అందుబాటులోకి తెచ్చి విధంగా చర్యలు చేపట్టారు.
గతంలో అనేక సార్లు శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆగమ శాస్త్ర పరిస్థితుల దృష్ట్యా కాకుండా భద్రతా పరిస్థితుల కారణంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో పై భాగంలో విమానాలు సంచరించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. అయినా ఇది పెద్దగా సత్ఫలితాలను ఇవ్వకపోగా ఆ పరిస్థితి సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు టీటీడీకి తేల్చి చెప్పేశాయి.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ అంశంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఒక లేఖ రాశారు. స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ భద్రత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయం పైభాగంలో ఉన్న ఆలయ సమీప ప్రాంతాల్లో విమానాలు హెలికాప్టర్లు ప్రయాణించకుండా దారి మళ్ళించాలని విజ్ఞప్తి చేస్తూ బీఆర్ నాయుడు లేఖ రాశారు.
కాగా గత ప్రభుత్వంలో చిన్నపాటి మైక్రో డ్రోన్లను కూడా తక్షణమే గుర్తించి వాటిని పనిచేయకుండా నిలిపివేసే నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం పలికారు. యాంటీ డ్రోన్ సిస్టమ్ కొనుగోలుపై భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో చర్చలు కూడా జరిపారు.
కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ప్రస్తుత పాలక మండలి యాంటీ డ్రోన్ సిస్టంను అమర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సలహాలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం సహకారంతో నేవల్ యాంటీ డ్రోన్ సిస్టమ్ను భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో మళ్లీ చర్చలు జరిపే అవకాశం ఉంది. త్వరలోనే టీటీడీ దీనిపై పూర్తి స్థాయి కసరత్తు జరిపి త్వరలోనే ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
ఈ యాంటీ డ్రోన్ సిస్టం తిరుమలలో ఏర్పాటు చేస్తే భవిషత్ లో యుద్ధం సంభవించిన యాంటీ డ్రోన్ సిస్టం ద్వారా తిరుమలను రక్షించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.