YS Jagan: ప్రతిపక్ష హోదాపై మరోసారి ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్

YS Jagan: శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎమ్మెల్యే, మాజీ సీఎం జగన్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. శాసనసభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు తిరస్కరిస్తూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఇచ్చిన రూలింగ్ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని దానిని రద్దు చేయాలని కూడా కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రూలింగ్ను ఆంధ్రప్రదేశ్ జీత భత్యాలు, పెన్షన్లు, అనర్హతల తొలగింపు చట్టానికి విరుద్ధంగా ప్రకటించాలని కోరారు.
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంలో శాసనసభ కార్యదర్శి, స్పీకర్ కార్యదర్శి, న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శితోపాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ను నేడు హైకోర్టు విచారణ జరపనుంది.



