ఏపీలో దిగజారిపోతున్న వైసీపీ

Andhra Pradesh: ఏపీలో బలపడేందుకు బీజేపీ పావులు కదుపుతోందా రాష్ట్రంలో బలపడేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తోందా వైసీపీ నుంచి బయటికి వస్తున్న నేతలకు గాలం వేస్తోందా టీడీపీ, జనసేనకు వెళ్లలేని నేతలపై కన్నేసిందా ఫ్యాన్ పార్టీని వీడిన నేతలు కూడా కమలం వైపు చూస్తున్నారా ఏపీలో పుంజుకోవడానికి బీజేపీ పన్నిన వ్యూహాలేమిటి లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. పార్టీ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న నేతలు.. కూటమి పార్టీలతో టచ్లోకి వెళ్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన, బీజేపీల్లో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు ఆసక్తి కనబరుస్తున్నారు. టీడీపీ అంటే గిట్టని నేతలు వైసీపీకి ప్రత్యామ్నాయంగా జనసేన, బీజేపీలను ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు జనసేనలో చేరగా బీజేపీ కూడా రంగంలోకి దిగిందని అంటున్నారు. ఏపీలో బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవడంతో పాటు తమ ఉనికి చాటుకోవాలని కమలం పెద్దలు తాపత్రయపడుతున్నారు. వైసీపీని వీడే నేతలు ఇకపై బీజేపీలో చేరేలా చూడాలని రాష్ట్ర పార్టీకి ఆదేశించినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి బీజేపీ బలం పెంచుకోవాలని వ్యూహం రచిస్తోంది కమలం పార్టీ. ఇప్పటికే విశాఖ డెయిరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ను పార్టీలోకి చేర్చుకుంది బీజేపీ. విశాఖ డెయిరీకి ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో బ్రాంచ్లు ఉన్నాయి. లక్షల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. ఇక విశాఖ డెయిరీలో అడారి కుటుంబం ఆధిపత్యం నాలుగు దశాబ్దాలుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో అడారి ద్వారా ఉత్తరాంధ్ర రైతాంగానికి చేరువ కావాలని ప్లాన్ చేసింది బీజేపీ. మరోవైపు శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాంను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
ఈ ఇద్దరే కాదు విశాఖ నగరంలోని ఓ మాజీ ఎమ్మెల్యే సైతం బీజేపీతో టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. విద్యాసంస్థలు ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యే తొలుత టీడీపీలో ఉండేవారు. గత ప్రభుత్వంలో తన విద్యాసంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వైసీపీలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అలా వెళ్లిన ఆ నేత.. చంద్రబాబు, లోకేశ్ పై తీవ్ర విమర్శలు చేయడంతో టీడీపీలో తలుపులు మూసుకుపోయాయి. దీంతో ఆయన బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారనే టాక్ నడుస్తోంది.
ఉత్తరాంధ్రతో బాగా సంబంధాలు ఉన్న మరో వైసీపీ మాజీ నేత కూడా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు రాజ్యసభ అవకాశమిస్తే పార్టీని రాష్ట్రంలో ఆర్థికంగా కూడా నిలబెడతానని ఆ నేత హామీ ఇచ్చారంటున్నారు.
ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఇతర రాష్ట్రాల కోటా నుంచి రాజ్యసభకు వెళ్లాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. తనను చేర్చుకుంటే వైసీపీ నుంచి కీలకమైన నేతలను పార్టీలోకి తీసుకువస్తానని 2029 నాటికి ఆ పార్టీని ఖాళీ చేస్తానని కూడా బీజేపీ పెద్దలకు ఆ నేత హామీ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వైసీపీని వీడిన నేతలను చేర్చుకుని ఏపీలో బలోపేతం కావాలని బీజేపీ చూస్తోంది. మరి కమలం పార్టీ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.