Chandrababu: ముంబై తరహాలో విశాఖ అభివృద్ధి

Chandrababu: ముంబై తరహాలో విశాఖపట్నం అభివృద్ధి చెందుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. గూగుల్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల రాకతో ఆ నగరం ఐటీ హబ్గా మారుతోందని చెప్పారు. మంత్రివర్గం సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులకు ఆమోదంతో పాటు.. సంస్థలు గ్రౌండ్ అయ్యేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. కేబినెట్ సమావేశంలో ఏ సంస్థకు ఆమోదం తెలుపుతున్నామో సంబంధిత శాఖ మంత్రి సమన్వయం చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఎంతో కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నప్పుడు వాటి ఫలాలు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్కు చాలా చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే దానిని మూతపడకుండా చేయగలిగామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి బయటకు తీసుకురాగలిగామని పేర్కొన్నారు. వైజాగ్కు రైల్వే జోన్, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టులను తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.
ఆర్సెలార్ మిత్తల్ ప్లాంట్కు త్వరలో శంకుస్థాపన చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖను ముంబై లాగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. 2028 నాటికి వైజాగ్ దేశంలో ఒక ప్రత్యేక సిటీగా ఉండబోతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో లక్షలాది ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వెస్ట్లో ముంబై తరహాలో ఈస్ట్లో విశాఖ అభివృద్ధి చెందబోతుందన్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్లో 4 లక్షల 70 వేల మంది ఆంధ్రాలో పని చేస్తున్నారని తెలిపారు. దీనిని 10 లక్షలకు పెంచాలని అధికారులకు చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.
మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మంత్రులు, సెక్రటరీలకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సిన బాధ్యత మంత్రులదే అని తెలిపారు. శాఖలో పని చేయకపోతే వారిని పిలిచి మందలించాల్సింది మంత్రులే అని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మంత్రులే కానీ అధికారులు కాదు అనే విషయం గుర్తు పెట్టుకోవాలని సీఎం చెప్పారు. తన 15 ఏళ్ల సీఎం ప్రస్థానంలో ఎప్పుడూ ఇన్ని పెట్టుబడులు రాలేదని చంద్రబాబు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ గూగుల్ డేటా సెంటర్ మనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెద్ద ఎత్తున రావడంపై పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.



