ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో సమసిన వివాదం.. థర్డ్‌ క్లాస్‌ వ్యాఖ్యలకు బోర్డు సభ్యుడు క్షమాపణ

TTD ఉద్యోగులు, బోర్డు సభ్యుడి మధ్య నెలకొన్న వివాదానికి తెరపడింది. ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చోరవతో సమస్య పరిష్కారమైంది. ఐదు రోజుల క్రితం మహాద్వారం గేటు వద్ద TTD ఉద్యోగి బాలాజీ సింగ్‌ను బోర్డు మెంబర్ నరేష్‍ కుమార్‍ దూషించడంతో దుమారం రేపింది. నరేష్ క్షమాపణ చెప్పాలంటూ టీటీడీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఉద్యోగ సంఘాలతో టీటీడీ ఉన్నతాధికారులు, పాలకమండలి సభ్యుల చర్చ సఫలం కావడంతో వివాదానికి తెరపడింది.

ఈనెల 18న శ్రీవారిని టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌ కుమార్‌ దర్శించుకున్నారు. దర్శనం అనంతరం తమవారితో కలిసి మహాద్వారం వద్దకు నరేష్ కుమార్ వచ్చారు. ఈ సందర్భంగా మహాద్వారం గేటు తీయాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న టీటీడీ ఉద్యోగి బాలాజీసింగ్‌ను నరేష్ కుమార్ సహాయకుడు కోరాడు. అయితే మహాద్వారం గేటు ద్వారా ఎవరినీ అనుమతించడం లేదని గేటు తీసేందుకు నిరాకరించారు బాలాజీసింగ్‌. ఈ విషయంలో అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని నరేష్ కుమార్ సహాయకుడికి బదులిచ్చారు. దీంతో నరేష్‌కుమార్‌ కోపంతో బాలాజీ సింగ్‌ను అసభ్యంగా దూషించారు. దురుసుగా ప్రవర్తించారు.

ఉద్యోగిని నరేష్‌ కుమార్‌ను దూషించిన విషయం ఉద్యోగ సంఘాల చెవిలో పడడంతో ఉద్యమానికి దారి తీసింది. ఉద్యోగులు ఏకతాటిపైకి చేరుకుని ఆందోళనకు దిగారు. నరేష్‌ కుమార్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అతను బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరేష్‌ కుమార్‌పై చర్యలు తీసుకొనేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.

వివాదానికి పుల్‌స్టాఫ్‌ పెట్డడానికి ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ చూపించారు. నరేష్‌కుమార్‌ను తిరుమలకు ఆహ్వానించి వివాదానికి తెరపడేలా చర్యలు తీసుకున్నారు. టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపం తెలిపారట నరేష్‌కుమార్‌. బాలాజీ సింగ్‌ను పిలిచి క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇది తమ కుటుంబ సమస్య అని అందరూ కలిసి చర్చించుకున్నామన్నారు నరేష్‌ కుమార్. దేవస్థానం ఖ్యాతిని పెంపొందించేలా కృషి చేస్తానని చెప్పారు. నరేష్ కుమార్ క్షమాపణ చెప్పడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కోరామన్నారు.

స్థాయికి తగ్గట్లు వ్యవహరిస్తే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదని స్థాయి మరచి ఆగ్రహ ఆవేశాలకు గురైతే సమస్యలు తప్పదని నరేష్ కథ చెబుతోంది. ఇకనైనా పాలకమండలి సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు.. క్రింది స్థాయి ఉద్యోగులను చులకనగా చూడకుండా హుందాతనంగా వ్యవహరించాలని కోరుకుందాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆశిద్దాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button