Trump: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కు ట్రంప్ విందు

Trump: ఓ వైపు ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం.. ఇంకోవైపు ప్రత్యక్షంగా ఇరాన్కు పాకిస్థాన్ మద్దతు. మరోవైపు భారత్- పాకిస్తాన్ మధ్య శత్రుత్వం. ఇన్ని పరిణామాల మధ్య పాకిస్థాన్ ఆర్మీ చీఫ్కు వైట్హౌస్లో అధ్యక్షుడు ట్రంప్ అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీని వెనుక ఏదో మతలాబు ఉందంటూ ప్రపంచ నాయకులు భావిస్తున్నారు. అసలు ఈ సమావేశం వెనుక ఉన్న రహస్యమేంటి..? ఏవరూ ఏ స్వలాభం కోసం చర్చలు సాగిస్తున్నారు..? దీనిని భారత్ ఏ విధంగా చూస్తుంది…?
ప్రస్తుతం ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటన కొత్త చర్చలకు దారితీస్తోంది. ఆయన వాషింగ్టన్ వచ్చిన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వైట్హౌస్ కేబినెట్ రూమ్లో వీరిద్దరికీ విందు ఏర్పాటు కావడం అరుదైన విషయం. సాధారణంగా సైన్యాధినేతలకు ఇలా అగ్రరాజ్యం గౌరవం ఇవ్వడం చాలా ప్రత్యేకం. ఈ భేటీ కొద్దిపాటి సందర్శనలా కనిపించినా మూసివేసిన తలుపుల వెనక అత్యంత కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది.
అసలైతే ట్రంప్ వద్ద లంచ్ ఫ్రీగా రాదు. తనకు ఉపయోగం లేకపోతే ఇచ్చే విందు కూడా ఆపేస్తారు. ఈ విషయం ప్రపంచ నాయకులు మొత్తానికి తెలుసు. గతంలో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకపోవడంతో విందు ఆపేసి.
ఆయన్ను శ్వేతసౌధం నుంచి సాగనంపారు. ఫక్తు వ్యాపారి అయిన ట్రంప్ ఇప్పుడు పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను ఆహ్వానించి కొసరికొసరి వడ్డించడానికి భారీ ప్లాన్లే ఉన్నాయి. ఈ విందుకు పాక్ భారీగానే మూల్యం చెల్లించనుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆడబిడ్డల నుదిటి సిందూరాన్ని చెరిపేసినోళ్ల భరతం పట్టింది ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సిందూర్ దెబ్బతో దాయాదికి గట్టిగానే షాక్ తగిలింది. భారత్ వరుస దాడులతో బిత్తరపోయిన పాక్ సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రపంచ దేశాల ముందునిలబడి దేహీ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్కు వచ్చే ఆదాయంలో 50 శాతానికి పైగా అప్పులు, వాటి వడ్డీలు కట్టడానికే వెచ్చిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో భారత్ను గెలికిమరీ తన్నించుకుంది పాకిస్తాన్. భారత సైన్యం చేసిన దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ 48 గంటల్లోనే చేతులెత్తేసింది. భారత్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని, అవసరమైతే అణుబాంబు ప్రయోగిస్తామని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ తెరవెనుక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాళ్లు పట్టుకుని బ్రతిమలాడారని వార్తలొచ్చాయి.
ఈ క్రమంలోనే భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెప్పుకున్నాడు. దీనిపై స్పందించిన భారత ప్రధాని మోదీ ఈ ఒప్పందంలో అమెరికా ప్రమేయమేదీ లేదని తేల్చిచెప్పారు. ఇది రెండు దేశాల సైన్యం చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయమని మధ్యవర్తి ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దీనిపై మరోసారి మాట్లాడిన ట్రంప్.. చాలా తెలివైన ఇద్దరు వ్యక్తులు యుద్ధాన్ని కొనసాగించకూడదని నిర్ణయించారు.
లేదంటే ఆ పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేవే. ఆ రెండూ అణుశక్తి కలిగిన దేశాలు. అందుకే ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నాయి అని పేర్కొన్నారు. అలాగే తాను పాకిస్థాన్ను ప్రేమిస్తున్నానని.. మోడీ కూడా అద్భుతమైన వాడు అంటూ వ్యాఖ్యానించారు. అంతేగాక భారత్, పాకిస్థాన్తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై తాము పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
అయితే మునీర్కు ట్రంప్ ఆతిథ్యమివ్వడం భారత్కు తీవ్ర అవమానకరమైన విషయం. భారతదేశ శత్రువైన భారత సరిహద్దుల్లో అమాయకుల ప్రాణాలు బలిగొన్న యుద్ధ పాపాసికి ట్రంప్ రాచమర్యాదలు చేశాడు. అన్ని డోర్లు మూసుకుని ఆ వ్యక్తితో కలిసి భోజనం చేశాడు. ఒక రకంగా భారత్ను అవమానించాడు. ట్రంప్ అంతటితో ఆగలేదు. రెండ్రోజుల క్రితం ప్రధాని మోదీతో ట్రంప్ ఫోన్కాల్లో మట్లాడాడు. వాషింగ్టన్ను సందర్శించాల్సిందిగా ప్రధానిని ట్రంప్ ఆహ్వానించాడు.
అయితే ట్రంప్ ఆహ్వానాన్ని మోడీ తిరస్కరించాడు. అందుకు కారణం అప్పటికే క్రోయేషియాలో పర్యటనకు మోదీ షెడ్యూల్ సిద్ధం చేసుకోవడం. ఆసిమ్ మునీర్ను ఆహ్వానించిన అదే సమయంలో ప్రధానిని కూడా రమ్మని ట్రంప్ పిలిచాడంటే ట్రంప్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. భారత ప్రధానిని కలిసిన తరువాత పాక్ ఆర్మీ చీఫ్ను కలవాలని ట్రంప్ ప్లాన్ వేసుకున్నాడు. దీన్ని బట్టి ట్రంప్ రాజకీయాలు ఎలా ఉంటాయో స్పష్టమవుతుంది. ఉగ్రదేశం పాక్ను, అగ్రదేశం భారత్ను ఒకే గాటిన కట్టేయడానికి ట్రంప్ యత్నిస్తున్నాడని తెలుస్తోంది. ట్రంప్ ఎత్తుగడలకు మోడీ అనుకోకుండానే తిరస్కరించాడు.
మరోవైపు అమెరికా నేడో, రేపో ఇరాన్పై యుద్ధానికి సన్నద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో అత్యధికంగా 909 కిలోమీటర్ల సరిహద్దును పంచుకొంటున్న పాత మిత్రుడు పాక్తో అగ్రరాజ్యానికి అవసరం పడింది. ఇందుకే పాక్ ఆర్మీ చీఫ్కు ట్రంప్ విందు ఇచ్చాడన్న వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. యుద్ధ సమయంలో టెహ్రాన్లో ఇంటెలిజెన్స్ సేకరణ, లాజిస్టిక్స్ అవసరాలు తీర్చడం, ఆ దేశంపై దాడికి వాయుసేన స్థావరాలు అమెరికాకు చాలా అవసరం.
ఇప్పటికే ఇస్లామాబాద్కు చెందిన నూర్ఖాన్ ఎయిర్ బేస్ వంటి వాటిని అమెరికా అనధికారికంగా వాడుకుంటోందంటూ పాక్కు చెందిన సెక్యూరిటీ ఎనలిస్ట్ ఇంతియాజ్ గుల్ ఇటీవల వెల్లడించారు. గతంలో కూడా అఫ్గానిస్థాన్లో ఆపరేషన్లు నిర్వహించే సమయంలో ఇస్లామాబాద్ను అమెరికా అక్కున చేర్చుకుంది. ఎందుకంటే పాక్కు 2వేల 640 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. తమపై అణుబాంబు వేస్తే పాక్ రంగంలోకి దిగుతుందని ప్రకటించిన ఇరాన్ సైన్యాధికారులు తాజా పరిణామాలతో కంగుతున్నారు. అలాగే తాము ఎవరినీ అణ్వాయుధాలు కోరలేదని ప్రకటించారు.
ఇక.. ట్రంప్ కుటుంబం కొత్తగా క్రిప్టో కరెన్సీ వ్యాపారంలోకి దిగింది. ఆయన కుమారులు ఎరిక్, డొనాల్డ్ జూనియర్, అల్లడు జేరెడ్ కుష్నర్లు కలిసి గతేడాది వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థను ప్రారంభించారు. దీంతోపాటు ఎరిక్, డొనాల్డ్ జూనియర్లు అమెరికన్ బిట్ కాయిన్ ఇన్కార్పొరేటెడ్ పేరిట ఓ బిట్కాయిన్ మైనింగ్ కంపెనీని ఏర్పాటుచేశారు.
వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఈ ఏడాది ఏప్రిల్లో పాక్కు వచ్చి ఆర్మీ చీఫ్ అసిం మునీర్ సమక్షంలో పాకిస్థాన్ క్రిప్టో కౌన్సిల్తో ఒప్పందం చేసుకొన్నారు. కానీ పాక్ క్రిప్టో కౌన్సిల్కు ఆర్థిక నేరాల్లో శిక్షపడిన బినాన్స్ క్రిప్టో ఎక్స్ఛేంజీ వ్యవస్థాపకుడు చాంగ్పెంగ్ సలహాదారు. ఈ ఒప్పందం ప్రకారం బ్లాక్చెయిన్, స్టేబుల్ కాయిన్ వంటి కార్యకలాపాలు చేపడతామని చెబుతున్నారు. అదే సమయంలో పాక్ క్రిప్టో కౌన్సిల్ చొరవతో 2,000 మెగావాట్ల విద్యుత్తును బిట్కాయిన్ మైనింగ్, ఏఐ డేటా సెంటర్లకు ఇస్లామాబాద్ కేటాయించనున్నట్లు ప్రకటించింది.
ఇవి ట్రంప్ కుటుంబ వ్యాపారానికి నేరుగా ఉపయోగపడే కార్యక్రమం. పాత ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ పరికరాలు, ఇతర కాలం చెల్లిన వ్యవస్థల కారణంగా ఆ దేశంలో ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా 2023 నాటికి 6,000 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. విద్యుత్తు కోతలు, బ్లాక్ఔట్లు సర్వసాధారణం. కొన్ని రోజుల క్రితమే బలోచిస్థాన్లోని తుర్బత్, కరాచీ నగరంలో విద్యుత్తు కోతలపై ఆందోళనలు జరిగాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ను సంతోషపర్చేందుకు పాక్ 2,000 మెగావాట్లు కేటాయించింది. దీంతోపాటు బలోచిస్థాన్లో ఖనిజాలు కూడా దక్కించుకోవచ్చని అమెరికా ఆశిస్తోంది.
ఇక ట్రంప్నకు అత్యంత ఇష్టమైన మరో విషయంలో పాక్ సహకారం లభిస్తోంది. అదే నోబెల్ ప్రైజ్. ఆయనకు ఆ అవార్డుపై ఎప్పటినుంచో కన్ను ఉన్నా రెండోసారి అధికారం చేపట్టిన నాటినుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుతో సమావేశం వేళ కూడా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబమాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు.
ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ మాట్లాడుతూ భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది.
సాధారణంగా విదేశీ నేతల సమావేశాలు తమ సమాన హోదా నాయకులతో ఉంటాయి. కానీ, గతంలో పాకిస్థాన్కు చెందిన ముగ్గురు జనరళ్లకు అమెరికా శ్వేతసౌధం ఆతిథ్యం ఇచ్చింది. వీరిలో ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్, జనరల్ జియా ఉల్ హక్, జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఉన్నారు.
కానీ, వీరంతా శ్వేతసౌధం విందుకు వచ్చేనాటికి పాక్లో తిరుగుబాటు చేసి సర్వాధికారులుగా ఎదిగారు. అయితే, అసిం మునీర్ మాత్రం సైనికాధికారి హోదాలోనే ఉన్నారు. ఆయనకు ఇప్పుడు ట్రంప్ విందు ఇవ్వడంతో పాకిస్థాన్లో అనధికార నియంతృత్వం ఉందన్న విషయానికి అమెరికా ఆమోదముద్ర వేసినట్లైంది.
డోనాల్డ్ ట్రంప్ వైఖరి భారత్కు ఏమాత్రం రుచించడం లేదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. ఉగ్రదాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్ను అమెరికా అక్కున చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ భేటీ జరిగింది.
ఇరాన్తో పాకిస్థాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో పాక్ ఆర్మీ చీఫ్ సమావేశం కావడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మూసివేసిన తలుపుల మధ్య జరిగిన ఈ విందు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు దేశాలను సమతుల్యం చేస్తూ ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. అసలు వీరిద్దరి భేటీ వెనుక ఏముందో భవిష్యత్ పరిణామాలను బట్టి చూడాలి.