Telangana: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు

Telangana: తెలంగాణ బీజేపీలో ప్రక్షాళన మొదలైందా..! ఇప్పటివరకూ ఒక లెక్క, ఇకనుండి ఒక లెక్క అంటున్నారా..! చెప్పిన మాట వినకుంటే చర్యలు తప్పవా..! అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి తెలంగాణ కమలం నేతలకు ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారట మాట వినకుంటే వేటు తప్పదని హెచ్చరించారట ఇంతకూ తెలంగాణ బీజేపీ నేతలు ఏం చేశారు..! వారికి అంతలా వార్నింగ్ ఇచ్చిందెవరు..! లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్టానం లోకల్ లీడర్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రతీ నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలు తయారు చేస్తున్నారట. ఇందులో వెనకబడిన వారిని సస్పెండ్ చేస్తామంటూ వార్నింగ్ సైతం ఇస్తున్నారట.
ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సాల్, బీజేపీ ప్రజా ప్రతినిధులు, నేతల ఆధ్వర్యంలో సమావేశం హాట్ హాట్గా జరిగిందట.
ఇటీవల తెలంగాణ బీజేపీ సభ్యత్వ నమోదు పూర్తి చేసింది. 40 లక్షల సభ్యత్వాలు పూర్తి చేశామని.. ఇక తమకు తిరుగు లేదని లీడర్లు భావించారు. కానీ లోకల్ లీడర్లు సభ్యత్వాలకు సంబంధించి అన్నీ అబద్ధాలు చెబుతున్నారని ఏకంగా13 వేల ఫేక్ సభ్యత్వాలు ఇచ్చారని రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సాల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. జిల్లా అధ్యక్షులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారట. కేవలం వర్క్షాప్లు, ఏసీ రూముల్లో ఇండోర్ మీటింగ్లు పెట్టుకుంటే సరిపోదని హెచ్చరించారట. దీంతో ఖంగుతిన్న నాయకులు గమ్మునుండిపోయారట.
తెలంగాణ బీజేపీ 13 వేల మంది క్రియాశీల సభ్యులను ఎంపికచేసింది. కానీ 4 వేల మంది మాత్రమే నిజంగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారట. సభ్యత్వ డేటాలో చాలా వ్యత్యాసాలున్నాయట. బీజేపీ నియమాల ప్రకారం క్రియాశీల సభ్యులు ముందుగా ప్రాథమిక సభ్యులుగా ఉచితంగా నమోదు చేసుకోవాలి.
ఆపై కనీసం 25 మంది కొత్త సభ్యులను నమోదు చేయాలి. అలాగే 100 మంది క్రియాశీల సభ్యత్వ రుసుము చెల్లించాలి. ఈ ప్రమాణాలను పాటించని దాదాపు 9 వేల మంది వ్యక్తులను క్రియాశీల సభ్యులుగా లెక్కించబోమని బన్సాల్ స్పష్టం చేశారట.
ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాడాలని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు పెట్టాలని బీజేపీ నేతలను సునీల్ బన్సాల్ ఆదేశించారట. అలాగే జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాలు చలో బస్తీ, అంబేడ్కర్ జయంతి వేడుకలపై వివరాలు అడిగి తెలుసుకున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై చేయాల్సిన పోరాటంలో మరింత వేగం పెంచాలని నేతలకు సునీల్ బన్సాల్ దిశానిర్దేశం చేశారట.
పార్టీ అగ్ర నాయకత్వం ప్రతి నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలు తయారు చేస్తోందని సునీల్ బన్సాల్ హెచ్చరించారట. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు పనితీరులో వెనుకబడిన వారిని సహించబోమని బన్సాల్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. పెండిగ్ంగ్లో ఉన్న మండలస్థాయి కమిటీల ఏర్పాటును మే 4 నాటికి పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టారట.
లేదంటే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలని పలువురు నాయకులను హెచ్చరించారట. సభ్యత్వ నమోదు, కొత్త కార్యక్రమాల అమలుతో సహా కీలక లక్ష్యాలను సాధించడంలో వెనకబడడంపై సునీల్ బన్సాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట.
సునీల్ బన్సాల్ సీరియస్ మీటింగ్తో ఖంగుతిన్న స్ధానిక నాయకులు సైలెంట్ అయ్యారట. ఇన్ని రోజులు చేసినట్లు ఇక చేయడం కుదరదని మరికొందరు చర్చించుకుంటున్నారట. మొత్తానికి తెలంగాణ బీజేపీ ప్రక్షాళన అవడం మంచిదే అనే భావనకు క్రిందిస్ధాయి కార్యకర్తలు వచ్చారట. పార్టీలో ఇప్పుడు ఇదే అంశపై చర్చ జరుగుతోందట.
మొత్తానికి తెలంగాణ బీజేపీ నేతలకు సునీల్ బన్సాల్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. మరి సునీల్ బన్సాల్ వార్నింగ్తోనైనా తెలంగాణ బీజేపీ నేతల్లో మార్పు వస్తుందా లేదంటే ఆయన మాటల్ని లైట్ తీసుకుంటారా తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.