వైసీపీ గూటికి చేరనున్న సుగవాసి?

Sugavasi Subramaniam: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. కత్తులు దూసుకున్న నేతలు ఒక్కటి కావచ్చు. ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండి మనసు మార్చుకొని, మరో పార్టీలోకి వెళ్లొచ్చు. కారణాలు ఏవైనా… వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలను ఎవరూ కాదనలేరు. సాగే రాజకీయాలు అలా సాగిపోతూనే ఉంటాయి. ఉమ్మడి కడప జిల్లాలోని ఓ సీనియర్ నేత పుట్టుక నుంచి ఉన్న పార్టీలో తనకంటూ ఘోరమైన అవమానం జరిగిందంటూ… రోజులు కాదు నెలల తరబడి ఆవేదన చెందారు. బయట చెప్పుకోలేక.. బాధ భరించలేక.. కడదాకా కన్నీళ్లను దిగమింగి.. చివరకు నిర్ణయమైతే తీసుకున్నారు. మరో పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. పచ్చ కండువా పక్కన పడేసి తాడేపల్లికి పయనం కానున్నారు. ఇంతకీ ఎవరా నేత..? ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళ సమయం ఉన్నా, ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఎందుకొచ్చింది..?
ఉమ్మడి కడప జిల్లాలో రాయచోటి అంటే.. సుగవాసి కుటుంబానికి బ్రాండ్.. టీడీపీ పుట్టాక ముందే పాలకొండ్రాయుడు 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండవ సారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక.. సుగవాసి పాలకొండ్రాయుడిని పార్టీలోకి ఆహ్వానించారు.. రాజంపేట పార్లమెంటు నుంచి టీడీపీ అభ్యర్థిగా పాలకొండ్రాయుడు సునాయాస విజయం సాధించారు. మొత్తం 8సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలుపొందారు రాయచోటి పెద్దాయనగా పిలువబడే పాలకొండ్రాయుడు.
ఎన్టీఆర్ పిలుపుతో తెలుగు దేశం పార్టీలో చేరి జిల్లా రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించారు. పాలకొండ్రాయుడు నాలుగు సార్లు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి రాజంపేట ఎంపీగా గెలిచారు . .వయస్సులో ఒంటి చేతితో రాయకీయాన్ని నడిపిన సుగవాసి.. వయసు మీద పడటంతో వారసత్వాన్ని పెద్దకొడుకు బాలసుబ్రమణ్యంకు అప్పగించారు. తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీ నుంచి ఒకసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పని చేశారు. రాయచోటి నియోజకవర్గంలో చక్రం తిప్పిన పాలకొండ్రాయుడి తనయుడికి అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం కలిసి రాలేదు. పోటీ చేసిన రెండు సార్లు బాలసుబ్రమణ్యం ఓడిపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం ప్రభంజనం సృష్టించిన ఎన్డీయే కూటమి..రాజంపేటలో మాత్రం టీడీపీ చతికిలపడిపోయింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రమణ్యం వైసీపీ అభ్యర్థిపై ఓటమి చవిచూశారు. సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచి..ఓడించారని జూనియర్ సుగవాసి ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజకవర్గం లో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబుకు విన్నవించినా లైట్ తీసుకున్నారని సుగవాసి తీవ్ర అసంతృప్తి కి లోనయ్యారట. గత కొంత కాలంగా తమ భవిష్యత్తు పై అంతర్మధనం చెందుతూ చివరికి టీడీపీకి బాలసుబ్రమణ్యం రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం తన తండ్రి, తాను తీవ్రంగా కష్టపడిన..తమకు అన్యాయం జరిగిందని సుగవాసి బాలసుబ్రమ్మణ్యం తీవ్ర మనోవేదనకు గురయ్యారట. రేపో మాపో వైసీపీలోకి చేరాలని సుగవాసి ఫిక్స్ అయ్యారట..ఇప్పటి మాజీ సీఎం జగన్తో తన రాజకీయ భవిష్యత్తుపై సుగవాసి సుబ్రమ్మణ్యం చర్చించినట్లు తెలుస్తోంది.
కూటమి సర్కార్కి మరో నాలుగేళ్లు అధికారంలో ఉండనుంది. నాలుగేళ్ల పవర్ ఉండగానే జూనియర్ సుగవాసి టీడీపీని వీడి వైసీపీ గూటికి చేరనుండడంపై జిల్లా పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బాలసుబ్రమ్మణానికి వచ్చే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ సీటు ఇస్తామని జగన్ హామీ కూడా ఇచ్చారట.. ప్రస్తుతం రాజంపేట నుంచి ఎంపీగా ఉన్న పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీ చేయించాలని వైసీపీ అధినేత భావిస్తున్నారట.. ప్రస్తుతం పీలేరు వైసీపీ ఇంచార్జ్గా ఉన్న చింతల రామకృష్ణారెడ్డిని జగన్ ఒప్పించారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ఉన్న మిథున్రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళితే..తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు పార్లమెంట్ నుంచి పోటీ చేయించే అవకాశమున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఒక నేత పార్టీ మారితే..ఎన్ని సర్దుబాట్లు జరగనున్నాయో..రాజకీయ భవిష్యత్తును కోరి టీడీపీని వీడి వైసీపీలోకి అడుగుపెడుతున్న సుగవాసి బాలసుబ్రమణ్యం ఇక్కడి పరిస్థితులు నల్లేరు మీద నడక కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీలోకి వెళ్తున్న సుగవాసికి పలువురు వైసీపీ కౌన్సిలర్లు ఇంటికొచ్చి స్వీట్లు తినిపించారు. మున్ముందు ఆయనకు మంచి రోజులు వచ్చినట్టేనా.. సుగవాసి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో..? చూడాలంటే మరో నాలుగేళ్లు ఓపిక పట్టాల్సిందే..!