Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో గందరగోళం.. ఆతిశీ సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. సీఎం కార్యాలయం నుంచి అంబేద్కర్, భగత్ సింగ్ల ఫొటోలు తొలగించారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. నిరస న తెలిపారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం, ప్రతిపక్ష నేత ఆతిశీ సహా 12మంది విపక్ష ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు అసెంబ్లీకి రాకుం డా సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ వెల్లడించారు.
లిక్కర్ కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికను కాసేపట్లో బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. దీన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆ పార్టీ నిరసనలకు పాల్పడుతోందని అధికార పార్టీ ఆరోపించింది. సీఎం కార్యాలయంలో మహాత్మా గాంధీ, అంబేద్కర్, భగత్సింగ్, రాష్ట్రపతి, ప్రధానమంత్రుల ఫోటోలు ఉన్నాయని పేర్కొంటూ ఇప్పటికే ఓ ఫొటోను విడుదల చేసింది.
ఆమ్ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం అనుసరించిన మద్యం విధానంపై అవకతవకలు రావడంతో దీనిపై కాగ్ ఆడిట్ చేసింది. దీనికి సంబంధించిన నివేదిక ఇప్పటివరకు అధికారికంగా విడుదల కానప్పటికీ ఆ మధ్యలో అందులోని అంశాలు లీకయ్యాయి. ఆ మద్యం విధానం కారణంగా ప్రభుత్వ ఖజానాకు 2వేల 26కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక తేల్చిందని సమాచారం.