Raj Gopal Reddy: మంత్రి పదవి రాకపోవడంపై రాజగోపాల్ రెడ్డి మౌనం

Raj Gopal Reddy: మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో ఓ ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద చరిష్మా ఉన్న నాయకుడు. ఇచ్చిన మాటకోసం కట్టుబడి ఉండే నాయకుడు అన్న పేరు ఆయన సొంతం. ఐతే గతంలో రాజగోపాలుడు పార్టీని వీడి బిజెపిలో జాయిన్ అయిన తర్వాత తిరిగి అతని పార్టీలోకి తెచ్చుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం అనేక ప్రయత్నాలు చేసింది.
అతనికి కావలసిన హామీ ఇచ్చింది. పార్టీలోకి తిరిగి తీసుకొచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే మాణిక్ రావ్ ఠాక్రే ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరతారని ప్రచారం నడిచింది. అయితే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభానికే ముందే పార్టీ సభ్యత్వం ఉండాలనే సాంకేతిక కారణాలతో హడావిడిగా ఆయన కాంగ్రెస్లో చేరినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ను ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారని.. పైగా కేసీఆర్ అవినీతిపై కేంద్రంలోని బీజేపీ ఎండగట్టడంలో విఫలమైందని చెబుతూ అందుకే తాను తిరిగి కాంగ్రెస్ గూటికి వెళ్తున్నట్లు రాజగోపాల్రెడ్డి అప్పట్లో ప్రకటించారు.
కాగా.. సాధారణ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని కొంత మేర కాంగ్రెస్ పెద్దలు పక్కన పెట్టేశారన్న విమర్శలు ఉన్నాయ్. సోదరుడికి ఆల్రెడీ మంత్రివర్గంలో స్థానం కల్పించాము కాబట్టి ఒకే ఇంట్లో రెండు పదవులు వేరే పరిస్థితులకు దారితీస్తాయని చిన్నగా రాజగోపాలుడికి నచ్చ చెప్పారట పార్టీ పెద్దలు.
ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెట్ నియోజకవర్గాల్లో ప్రతి సెగ్మెంట్ కు కేవలం మంత్రులను మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ లుగా నియమించింది. కానీ భువనగిరి పార్లమెంటు స్థానానికి ఇన్చార్జి బాధ్యతలు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి అప్పగించారు. దీనిని బట్టి తమ నాయకుని చరిష్మా ఏంటో అర్థం అవుతుందని అతని అభిమానులు గొప్పగా చెప్పుకుంటుంటారు.
అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముకాకుండ భువనగిరి పార్లమెంట్ స్థానంలో పూర్తిస్థాయిలో వెనకబడి ఉన్న పార్టీని విజయతీరాలకు చేర్చడమే కాకుండా భారీ మెజార్టీని తీసుకురావడంలో రాజగోపాల్ రెడ్డి కీలక భూమిక నిర్వహించారు. ఇదే సమయంలో భువనగిరిలో పార్టీని గెలిపించినట్లయితే మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పిస్తామని కేంద్ర అధిష్టానమే హామీ ఇచ్చిందట. కానీ ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మరో మారు కాంగ్రెస్ పెద్దలు మొండి చేయి చూపించారు.
కాగా.. క్యాబినెట్లో ఆరు ఖాళీలు ఉండగా మూడింటిని భర్తీ చేసింది అధిష్టానం. అయితే మంత్రి వర్గంలో తమకు చోటు లభిస్తుందని పలువురు ఎమ్మెల్యేలు భావించారు. కానీ చాలామందికి మొండిచేయే మిగిలింది. ఇంతకాలం మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూసిన కొందరు సీనియర్లు, అటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుండగానే అలకపాన్పు ఎక్కారు.
తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు. కాంగ్రెస్ అథిష్టానం పెద్దలకూ అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వారి ఇండ్లకు కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉరుకులు పరుగులు పెట్టారు. బుజ్జగింపులు మొదలు పెట్టారు. మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారి ఇళ్లకు వెళ్లి స్వయంగా వారితో మాట్లాడుతున్నారు. ఎన్నో నెలలుగా ఊరిస్తూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ పూర్తి చేశామన్నట్లుగా ముగ్గురితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించింది.
సోషల్ ఇంజనీరింగ్ కు పెద్దపీట వేశామని, మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంది. విస్తరణలో కొత్త మంత్రులుగా బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరి, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మాదిగ వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రమాణం చేశారు. మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని అయిపోయిపోయిందనిపించారు.
ఇదిలా ఉండగా మొదటి నుంచి మంత్రి పదవికోసం ప్రయత్నం చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పదవీ దక్కలేదు. ఇప్పటికే ఆయన సోదరుడు మంత్రిగా ఉండటంతో ఆయనకు స్థానం దక్కలేదని తెలుస్తోంది. ఇక్కడి వరకు భాగనే ఉన్నా ఆయన వర్గీయులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తమ ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వాలని పట్టుపడుతున్నారు. లేదంటే ఆత్మహత్య చేసుకుంటామని వార్నింగ్ కూడా ఇస్తున్నారు.
కానీ.. రాజగోపాల్ రెడ్డి ఈ విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు. గత రెండు రోజుల క్రితం మాత్రం రాజగోపాల్ రెడ్డి ఓ ఆసక్తికరమైన ట్విట్ చేశాడు. కొత్తగా మంత్రి పదవులు పొందిన ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు.
ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నానని తెలిపారు. తనకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదని ప్రజల పట్ల నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలే తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. అదే కారణంగా తానే తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అన్నారు.
తాను మంత్రిగా లేక పోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో తాను ఎప్పటికీ ముందుంటానని అన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పని చేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని అన్నారు. అదే మార్గాన్ని తాను ఎంచుకున్నానంటూ ఆయన ట్వీట్ చేశారు.
అయితే.. రాజగోపాల్ రెడ్డి ట్వీట్ వెనుక అనేక నిగూడ అర్థాలు దాగి ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలు కోమటిరెడ్డి రాజకీయ వైఖరికి అద్దం పడుతున్నాయని, ఆయన పార్టీ పట్ల నిజమైన విధేయతను చూపిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖాళీగా ఉన్న మూడు బెర్త్ లలో ఒక బెర్త్ రాజగోపాల్ రెడ్డికే అని అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే అతను ఈ విధంగా సహనంగా వ్యవహరిస్తున్నారనే అంశం జిల్లాలో చక్కర్లు కొడుతోంది.
పదవులు మారినా, స్థానాలు మార్చినా తన లక్ష్యం మాత్రం ప్రజల అభివృద్ధే అని మరోసారి స్పష్టం చేసిన రాజగోపాల్ రెడ్డి ఈ ప్రకటనతో తన భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలకు దారితీసే సంకేతాలనిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీలో విభేదాలు రావద్దనే ఉద్దేశ్యంతో అధిష్టానం మంత్రివర్గ విస్తరణలో తాత్కాలికంగా చోటు కల్పించలేదనే వాదన మాత్రం బలంగా వినిపిస్తుంది. మరి చూడాలి అధిష్టానం మదిలో ఏముందో.