ప్రధాని మోడీ ముందు మనసులో మాట చెప్పిన ఒమర్ అబ్దుల్లా

ఒకప్పుడు నేను రాష్ట్రానికి సీఎం… ఇప్పుడొక కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రతినిధిని. ఐనప్పటికీ ఆశయం మారలేదు. మళ్లీ జమ్మూ కాశ్మీర్కు పూర్తి హక్కులు రావాలని కోరుతున్నానని ప్రధాని మోడీ సమక్షంలోనే మనసులో మాట చెప్పాడు జమ్ము, కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. కత్రా రైల్వే లింక్ ప్రారంభోత్సవం వేదికగా తన చతురతను చాటాడు.
జమ్మూ కశ్మీర్ హోదాపై మళ్ళీ చర్చ తెరపైకి తెచ్చారు. పోరాటం కొనసాగుతుందని, తాను మాట మార్చబోనన్నాడు. ఆర్టికల్ 370 రద్దుతో తీసిన హోదాను తిరిగి ఇవ్వాలని మళ్లీ ప్రధాని మోడీకి ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేశారు మాజీ సీఎం ఒమర్. మొత్తం వ్యవహారాన్ని రెండు ముక్కల్లోనే మాట్లాడినా, తీవ్రత ఎక్కువగానే ఉంది.
డిమాండ్ను చెప్పేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాత్రాలో కాశ్మీర్కు మొదటి రైలును ప్రారంభించిన కార్యక్రమాన్ని అబ్దుల్లా ఉపయోగించుకున్నారు. హాస్యాన్ని రంగంరించి, సంకల్పాన్ని సూటిగా చెప్పాడు. 2014లో తన మొదటి ప్రభుత్వ చివరి కార్యక్రమం కాత్రా రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ, నాడు-నేడు తాను ప్రధాని మోడీతో వేదిక పంచుకున్నానన్నాడు.
నాడు నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధాని అయ్యాక, అక్కడికి వచ్చారన్నారు. దేవుని దయతో కత్రా రైల్వే స్టేషన్ను ప్రారంభించారన్నాడు. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో గెలిచి ఈ దేశానికి ప్రధానమంత్రిగా కొనసాగారని కితాబిచ్చాడు.
PMOలో మీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, నాడు రైల్వే సహాయ మంత్రిగా ఉన్నారని, గౌరవనీయ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారన్నాడు. నాడు, తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యతలు నిర్వర్తించేవాడనని, ఇప్పుడు కొద్దిగా తగ్గానని చెప్పాడు. అప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా, నేడు కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రినంటూ పరోక్షంగా తన హోదా తగ్గిందని వివరించాడు ఒమర్ అబ్దుల్లా.
మీరు తలుచుకుంటే దాన్ని సరిదిద్దడానికి ఎక్కువ సమయం పట్టదన్నాడు. జమ్మూ కశ్మీర్ మళ్ళీ రాష్ట్ర హోదాను ఇవ్వాలని మోడీని ఉద్దేశించి అబ్దుల్లా కోరాడు. జమ్మూ కాశ్మీర్ను ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లడఖ్గా విభజించారు.
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి తన ప్రసంగంలో, 1980ల ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పటి నుండి గడిచిన గణనీయమైన కాలాన్ని అబ్దుల్లా గుర్తు చేసుకున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు తాను ఎనిమిదో తరగతి విద్యార్థినని, ఇప్పుడు తనకు 55 ఏళ్లన్నాడు.
తన పిల్లలు కూడా కాలేజీ చదువు పూర్తి చేశాడన్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తయిందన్నారు. కశ్మీర్ లోయ – దేశంలోని మిగిలిన ప్రాంతాల మధ్య దశాబ్దాల రైల్వే లింక్ ప్రయాణానికి మార్గం సుగమమైందన్నాడు. బ్రిటిష్ కాలం నుంచే కశ్మీర్ను ఉరి, జీలం ద్వారా రైలు ద్వారా అనుసంధానించాలనుకున్నారు. కానీ ఆ కలను మోడీ సాకారం చేశారన్నారు.
మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తుచేసుకుంటూ, అబ్దుల్లా, ఈ సందర్భంగా వాజ్పేయికి ధన్యవాదాలు చెప్పకపోతే నేను చాలా పెద్ద తప్పు చేసినవాడిని అవుతానన్నాడు. ఆయన దీనికి జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ హోదా ఇచ్చి బడ్జెట్లో భాగం చేసిన తర్వాత ఇది జరిగిందని అన్నారు. హైవే మూసివేత సమయంలో పెరిగిన విమాన ఛార్జీలను కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
వర్షం వచ్చిన వెంటనే హైవే మూసివేయబడినప్పుడు, విమానయాన సంస్థలు దోచుకోవడం ప్రారంభిస్తాయన్నాడు. 5 వేల టికెట్ అకస్మాత్తుగా గంటల్లోనే 20 వేలకు పెంచేస్తారన్నాడు. ఆపిల్, చెర్రీస్ వంటి పండ్ల రవాణాకు రైల్వే లైన్ సహాయపడుతుందని అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు.