Tirumala: భక్తుల సందడి కరువై వెలవెలబోతున్న తిరుమల

Tirumala: శత్రుదేశం పాకిస్తాన్ తో జరుగుతున్న భీకర పోరు పుణ్యమా అని తిరుమలలో ఊహించని పరిస్థితులు ఏర్పడ్డాయి. వేసవి సెలవులు ప్రారంభం మొదలు ఎటుచూసినా భక్తజన సందోహంగా కిటకిటలాడే తిరుమల క్షేత్రం భక్తుల సందడి కరువై వెలవెలబోతుంది. కంపార్ట్మెంట్లు, క్యూ లైన్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వేసవిలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా టీటీడీ చేసిన ముందస్తు ఏర్పాట్లన్నీకూడా ప్రస్తుతానికి తలకిందులు అయ్యాయి.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఆ దేవదేవుడు స్వయం వ్యక్తమై వెలసిన దివ్య క్షేత్రం తిరుమల కావడంతో నిత్యం భక్త జన సందోహంగా ఉంటుంది. ఎటు చూసినా భక్తి పారవశ్యంతో గోవింద గోవిందా అంటూ భక్తులు పిలిచే పిలుపులే వినిపిస్తూ ఉంటాయి. తిరుమల క్షేత్రంలో కాలు మోపితేనే గత జన్మలో చేసుకున్న పాపాలన్నీ తొలగి మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక స్వామి వారి ఆలయం ప్రవేశం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తారు భక్తులు. ఆ దేవదేవుని క్షణకాల దర్శనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తారు. అందుకే తిరుమల క్షేత్రం నిత్యం భక్త జనంతో కిటకిటలాడుతూ ఉంటుంది. సాధారణ రాజుల్లో 65 నుంచి 75 వేల మంది వరకు భక్తులకు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.
వారాంతంలో ఆ సంఖ్య 80 నుంచి 95 వేల మంది వరకు అమాంతం పెరుగుతూ ఉంటుంది. వరుస సెలవులు వస్తే తండోపతండాలుగా భక్తులు తరలి వస్తారు. విశేష దినాల్లో అయితే భక్తుల సంఖ్య లక్షకు పైమాటే. సాధారణంగా వెసవి సెలవుల్లో సైతం భక్తుల రద్దీ అనూహ్యంగా ఉంటుంది.
వేసవి సెలవులు కారణంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజా ప్రతినిధులు, రాజ్యాంగబద్ధంగా హోదాలో ఉన్న ప్రముఖుల సిఫార్సులపై ఇచ్చే బ్రేక్ దర్శనాలను జూలై 15 వరకు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
జూన్ 17 కే సెలవులు పూర్తి అయినప్పటికీ మరో నెల రోజులపాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం కల్పించేలా తిరుపతిలో టైం స్లాటెడ్ టోకెన్స్ సైతం అందుబాటులో ఉంచింది. వేసవికి అనుగుణంగా తిరుమలలో చలవపందిళ్లు, జర్మన్ షేడ్స్ ను ఏర్పాటు చేసింది.
ఇక భక్తుల రద్దీ పెరిగితే అందుకు అనుగుణంగా పర్యవేక్షణ ఉండటానికి తిరుపతి ఏడీ బిల్డింగ్ నుంచి శాశ్వత ఉద్యోగులను తాత్కాలికంగా తిరుమలలో విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ తో పాటుగా భక్తులకు అన్నపానీయాలు అందించేందుకు శ్రీవారి సేవకులను సైతం సన్నద్ధం చేసింది.
అయితే ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మాత్రం తిరుమలలో భక్తుల రద్దీ నామమాత్రంగా కొనసాగుతోంది. రోజుకు 60 నుంచి 65 వేల లోపే భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇందుకు ప్రత్యేక కారణం లేకపోలేదు. భారత్ పాక్ మధ్య యుద్ధం వాతావరణం నెలకొనడం శాంతి చర్చలు సాగిన పాక్ తన దుశ్చర్యను కొనసాగిస్తూ ఉంటడం కారణం అయి ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఇక వేసవిలో ఎన్నడూ లేని విధంగా భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న తరుణంలో వేసవి తాపాన్ని తట్టుకోలేక భక్తులు తిరుమల ప్రయాణం తాత్కాలికంగా వాయిదా వేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరో 28 రోజుల్లో వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని ఈ వారాంతంలో భక్తుల రద్దీ అమాంతం పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తుంది టీటీడీ.