AP News: ఏపీ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్ ?

AP News: రాజకీయమంటేనే అనూహ్యం. పదవులు ఎంత వేగంగా వస్తాయో.. అంతే వేగంగా కీలక పదవులు లభిస్తాయ్. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ చిత్తుకావడంతో కూటమి రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికల్లో కూటమికి ఊపిరి ఊదిన పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా చంద్రబాబు కేబినెట్లో కొలువుదీరారు. ఆయనతోపాటు నారా లోకేష్ కీలక శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి ప్రభుత్వంలో లోకేష్ కీలకంగా మారారు.
ఓవైపు పవన్ కల్యాణ్ నిత్యం వార్తల్లో ఉన్నప్పటికీ లోకేష్ మాత్రం తెరవెనక మంత్రాంగానికే పరిమితమయ్యారు. కరుడుగట్టిన టీడీపీ నేతలు మాత్రం నారా లోకేష్ ఏం తక్కువ ఆయనను డిప్యూటీ సీఎంగా చేయొచ్చన్న అభిప్రాయాన్ని ఆఫ్ ద రికార్డ్ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాభివృద్ధి కోసం నారా లోకేష్ చేస్తున్న కృషిని గుర్తించాలని.. డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చంద్రబాబుకు సూచించారు.
శ్రీనివాసరెడ్డి, టీడీపీ కష్ట కాలంలోనూ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతగా గుర్తింపు పొందారు. అదే సమయంలో వైఎస్ జగన్ సొంత జిల్లా కడపకు చెందిన నాయకుడిగాను టీడీపీలో ప్రాధాన్యత పొందారు. తాజాగా చంద్రబాబు కడప పర్యటనలో భాగంగా టీడీపీ కీలక రాజకీయ విభాగ సభ్యుడైన శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ కూటమిలో చర్చనీయాంశమయ్యాయి. ఓవైపు జనసేనాని పవన్ కల్యాణ్ పలు విషయాల్లో మీడియా ముఖంగా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ టీడీపీలోనే చాలా మంది నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు తాజాగా శ్రీనివాసరెడ్డి బహిర్గతం చేయడంతో జనసైనికులు ఇప్పుడు చంద్రబాబు వైపు చూస్తున్నారు.