KP Sharma: శ్రీ రాముడు మా దేశంలోనే జన్మించాడు.. నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు

KP Sharma: శ్రీ రాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు తమ దేశంలోనే జన్మించాడని ఆయన పేర్కొన్నారు. శ్రీరాముడు నేపాల్లోనే జన్మించాడని ఓలి పునరుద్ఘాటించారు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని తెలిపారు. ఈవిషయం ప్రచారం చేయడానికి దేశ ప్రజలు ఏమాత్రం సంకోచించవద్దని పిలుపునిచ్చారు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ప్రశ్నించారు.
రాముడు పుట్టిన స్థలం నేపాల్లోనే ఉందని, అది ఇప్పటికీ అక్కడే ఉందన్నారు. దీన్ని తాము అంతగా ప్రచారం చేయలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. అది కొందరిని బాధిస్తుందని తాను భావిస్తున్నానన్నారు. ఈసందర్భంగా ఆయన శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నారు. ఇది తాను సొంతంగా చెబుతున్నది కాదని, వాల్మీకి రాసిన రామాయణంలోనే ఇది కూడా ఉందన్నారు.