Telangana: 42 ఏళ్ల తర్వాత.. మహాఘట్టం..

Telangana: గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమం.. దక్షిణ కాశీగా వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో మహా ఘట్టానికి సమయం ఆసన్నమైంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రంలో 42 ఏళ్ల తర్వాత మహాకుంభాషేక మహోత్సవ వేడుక జరగనుంది. నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు కుంభాషేక మహోత్సవం కనుల పండువగా సాగనుంది. ఆలయం నుంచి అర్చకులు మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్చరణల మధ్య కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకొని 5 కలశాలతో గోదావరి జలాలు సేకరించారు అర్చకులు.
అనంతరం గో పూజ, గణపతి పూజతో పూజకార్యక్రమాలు ప్రారంభించారు. సుమారు 50 మంది రుత్వికులతో విశేష పూజలు, పారాయణం చేయనున్నారు. సహస్ర ఘటాభిషేకం క్రతువులో 1180 కళశాలను ఆవాహన, కళశారాధన చేసి వివిధ నదీ జలాలు, ద్రవ్యాలతో విశేష పూజల అనంతరం కాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారికి సహస్ర ఘాటాభిషేకం నిర్వహించనున్నారు. దీంతో మూడు రోజులు పాటు కాళేశ్వరంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది.
ఈ మహాఘట్టానికి సకల ఏర్పాట్లు చేసింది దేవాదాయశాఖ. ఈ మూడు రోజులపాటు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భక్తులకు గర్భాలయం దర్శనాలు నిలిపివేసింది. 9న ఉదయం 10గంటల 42నిమిషాలకు తుని పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతీ స్వామి చేతుల మీదుగా మహా కుంభాభిషేకం జరగనుంది. అనంతరం పీఠాధిపతి అనుగ్రహా భాషణం చేపట్టనున్నారు. దాతలకు ఆశీర్వచనం, కళశాల వితరణ చేయనున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జర్గకుండా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు.