ఆంధ్ర ప్రదేశ్

శ్రీ‌వారిపై అచంచ‌ల‌మైన‌ భ‌క్తిని చాటుకున్న దివంగత ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి

హైద‌రాబాద్ కు చెందిన‌ మాజీ ఐఆర్ఎస్ అధికారి స్వర్గీయ వై.వి.ఎస్.ఎస్. భాస్కర్ రావు త‌న మ‌ర‌ణానంత‌రం వీలునామా ద్వారా టీటీడీకి రూ.3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు త‌న బ్యాంకు ఖాతాల్లో దాచుకున్న రూ.66 ల‌క్ష‌ల‌ను విరాళంగా అందించి అచంచ‌ల‌మైన భ‌క్తిని చాటుకున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం ప్రాంతంలో ఉన్న “ఆనంద నిలయం” అనే 3,500 చదరపు అడుగులు గల భవనాన్ని, ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఆయ‌న టీటీడీకి విరాళంగా ఇస్తున్న‌ట్లు వీలునామాలో పేర్కొన్నారు.

త‌ను బ్యాంకులో దాచుకున్న సొమ్మును టీటీడీ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.36 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర స‌ర్వ శ్రేయాస్ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర వేద ప‌రిర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ వేంక‌టేశ్వ‌ర గో సంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విద్యాదాన ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు రూ.6 ల‌క్ష‌లు విరాళంగా అందివ్వాల‌ని సంక‌ల్పించారు.

తన జీవితాంతం శ్రీ‌వేంకటేశ్వరస్వామి సేవలో అంకితమై ఉండాలని భాస్క‌ర్ రావు అంతిమ కోరిక మేరకు ఆయ‌న మ‌ర‌ణానంతరం ట్ర‌స్టీలు ఎం.దేవరాజ్ రెడ్డి, వి.సత్యనారాయణ, బి.లోకనాథ్ లు వీలునామా ప్ర‌కారం టీటీడీకి చెందాల్సిన‌ ఆస్తి ప‌త్రాలు, చెక్కుల‌ను గురువారం ఉద‌యం శ్రీ‌వారి ఆల‌యంలోని రంగ‌నాయకుల మండ‌పంలో టీటీడీ అద‌న‌పు ఈవో వెంక‌య్య చౌద‌రి అందజేశారు.

ఇక హైదరాబాద్ కు చెందిన ట్రినిటీ కంబైన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.2 కోట్లు (వేర్వేరు చెక్కుల రూపంలో) విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button