
Puri Jagannath Rath Yatra : ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. శ్రీగుండిచా ఆలయం వద్ద తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. మృతులు ప్రేమకాంత మొహంతి, బసంతి సాహూ, ప్రభాతి దాస్గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
శనివారం రథయాత్ర ముగిసిన తర్వాత జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి వద్దకు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున 4గంటల 20నిమిషాల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భక్తులు శ్రీగుండిచా ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో చెక్క దుంగలను మోసుకెళ్లే రెండు ట్రక్కులు.. రద్దీగా ఉన్న ప్రదేశంలోకి ప్రవేశించడంతో తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రులను పూరీలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇక పూరీ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అధిక జనసమూహం, అలసట కారణంగా దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు వారిని కూడా ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలామందిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 12 మంది భక్తులు కటక్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.