PM Modi: శత్రువుల స్వర్గం… శ్మశానంగా మారుతుంది

PM Modi: ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పారు. కలాంని పూజిస్తామన్నారు. కసబ్ని పాతరేస్తామన్నారు. తీవ్రవాద దాడి జరిగిన రెండ్రోజుల తర్వాత బీహార్లో జరిగిన బహిరంగ సభలో ఇండియా ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇండియన్లంటే చులకననుకుంటున్నోళ్లను వదలబోమన్నారు. దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే వాళ్లనే లేకుండా చేస్తామన్నారు. పరమత సహనమే ఆభరణంగా ఉన్న ఇండియా ఎప్పుడూ కూడా ధర్మాన్ని రక్షించిందని, ధర్మం కోసం నిలబడిందన్న సిద్ధాంతాన్ని మోడీ మరోసారి వెలుగెత్తి చాటారు.
కశ్మీర్ పెహల్గామ్ దాడుల తర్వాత మోడీ తనదైన శైలిలో పాకిస్తాన్కు దిమ్మతిరిగిపోయేలా కౌంటర్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోడానికి ఇదేమీ చేవలేని దేశం కాదని, సత్తా ఉన్న దేశమని నిరూపిస్తామన్నారు. అందుకే ముష్కరులను పాకిస్తాన్ ఎక్కడ దాచిపెట్టిన చెంబ్డాలు వలిచేస్తామన్నారు. అంతే కాదు వారి వెనుక ఉన్న ఎరినైనా అంతం చేస్తామన్నారు. ఇండియా విధానం అనాదిగా ప్రపంచం చూస్తూనే ఉందన్నారు. అందుకే కలామ్ స్ఫూర్తితో పనిచేస్తున్నామన్నారు. అలాగే ఇండియాను దెబ్బకొట్టాలనే కసబ్ను పాతరేస్తామన్నారు.
విధ్వంసం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. పహల్గామ్ దాడి తర్వాత పాక్లోకి ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులు, కుట్ర పన్నిన వారికి ఊహించని విధంగా శిక్ష విధిస్తామన్నారు. కార్గిల్ నుండి కన్యాకుమారి వరకు దుఃఖం, కోపం ప్రజల్లో ఉందన్నారు మోడీ. దాడిలో అమాయక పర్యాటకులపై మాత్రమే కాదు భారతదేశ ఆత్మపై శత్రువులు దాడి చేసే ధైర్యం చేశారని అలాంటి వారిని వదిలేది లేదన్నారు.
దాడి చేసిన ఉగ్రవాదులు, అందుకు కుట్ర పన్నిన వారికి ఊహకు అందని శిక్ష విధిస్తామన్నారు. ఉగ్రవాదులకు స్వర్గధామంలా ఉన్న ప్రాంతాలను సర్వనాశనం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 140 కోట్ల మంది సంకల్పం ఉగ్రవాద నాయకుల వెన్ను విరిచివేస్తుందన్నారు, భారత గడ్డపై ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా సందేశం పంపడానికి, ప్రధానమంత్రి స్పష్టంగా ఇంగ్లీషులో మాట్లాడారు. ప్రపంచానికి మొత్తానికి నేను ఇదే చెబుతున్నానన్న మోడీ.. భారతదేశం ప్రతి ఉగ్రవాదిని, వారికి మద్దతు ఇచ్చేవారిని గుర్తించి, ట్రాక్ చేసి శిక్షిస్తుందన్నారు. సప్తసముద్రాల ఆవల ఉన్న వారిని వెతికి శిక్షిస్తామన్నారు మోడీ. ఉగ్రవాదం భారతదేశ స్ఫూర్తిని ఎప్పటికీ విచ్ఛిన్నం చేయలేదన్నారు.
ఉగ్రవాదం కచ్చితంగా శిక్షించబడుతుందన్నారు. న్యాయం జరిగేలా వందకు వంద శాతం చేస్తామన్నారు. దేశం మొత్తం ఈ సంకల్పం తీసుకుందన్నారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మనతో ఉంటారన్నారు. ఈ సమయంలో మనతో పాటు నిలిచిన వివిధ దేశాల అధినేతలకు, ప్రజలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కాశ్మీర్లో జరిగిన దారుణమైన దాడికి మొదటి ప్రతిస్పందనగా, దాని వెనుక ఉన్న వారిని ఎవరినైనా వదిలిపెట్టన్నారు.
ఇక పాకిస్తాన్ విషయంలో పంచ సూత్రాలతో ఆ దేశాన్ని కట్టడి చేయాలన్న ఉద్దేశాన్ని కేంద్రం ప్రకటించింది. వాటిలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత ప్రధానమైనది. ఇరు దేశాల మధ్య నదీ జలాల భాగస్వామ్యాన్ని నియంత్రించే పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మానుకునే వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుంది. 1960లో సంతకాలు చేసిన సింధు జలాల ఒప్పందం ఎంతో కీలకమైనది.
రెండో నిర్ణయంగా, అట్టారి-వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ మూసివేయాలని మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ నిర్ణయంతో అన్ని సరిహద్దు కదలికలను మూసివేసినట్టవుతుంది. ఇందులో ప్రజలు, వస్తువుల కదలికను నిలిపివేయడం కూడా ఉంది. ఇప్పటికే చెల్లుబాటు అయ్యే పత్రాలతో దాటిన వ్యక్తులు 01 మే 2025 నాటికి తిరిగి రావడానికి అనుమతించబడతారు. భూరవాణా కేంద్రం మూసివేతతోపాటు, సరిహద్దు కదలికను నిలిపేయడం ద్వారా పాక్కు ఇబ్బందులు తప్పవు.
మూడో నిర్ణయంగా పాకిస్తాన్ వాసులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. దౌత్యపరంగా ఆ దేశాన్ని ఇరుకునపెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి. పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకం కింద ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ జాతీయులు 48 గంటల్లోగా దేశం విడిచివెళ్లాలి. నాలుగో నిర్ణయంగా పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుంచి వెళ్లిపోవాలని కోరింది.
పాక్ సైనిక, నావికా, వైమానిక సలహాదారులను భారతదేశం నుండి బహిష్కరించింది. ఈ సిబ్బందిని పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించి వారంలోపు భారతదేశాన్ని ఖాళీ చేయాలని ఆదేశించింది. అదే సమయంలో ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి మనోళ్లను కూడా ఇండియా వెనక్కి పిలిపిస్తోంది. ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను తగ్గిస్తామంది. పాకిస్తాన్లోని భారత హైకమిషన్ మొత్తం బలాన్ని మే1 నాటికి, 30కి తగ్గిస్తామంది. ప్రస్తుతం పాకిస్తాన్లో 55 మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్యల పరిధిని తగ్గిస్తుంది.