హైడ్రాపై మరోసారి హైకోర్టు సీరియస్

హైడ్రాపై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అని మండిపడింది. శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేయడం ఏంటని ప్రశ్నించింది. సెలవు దినంలో కూల్చివేతలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామంలోని ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాలారెడ్డి.. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్ట విరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అక్రమ నిర్మాణమంటూ అధికారులు శుక్రవారం పిటిషనర్కు నోటీసులు ఇచ్చారన్నారు. శనివారం వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పారని.. ఆ వెంటనే ఆదివారం కూల్చివేతలు చేపట్టారని కోర్టుకు తెలిపారు పిటిషనర్.
టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిటిషనర్కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. నోటీసులు జారీ, విచారణ, కూల్చివేతలు.. స్వల్పకాలంలో చేపట్టేలా నిర్ణయాలు తీసుకోవద్దని తేల్చిచెప్పారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, అయినా చేపడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.