Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

Tirumala: తిరుమలకు ఒక్కసారిగా వాహనాల రద్దీ పెరిగింది. సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం నుంచి గరుడు విగ్రహం వరకు వాహనాలు బారులుతీరాయి. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుండటంతో.. వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు.
కేవలం దర్శనం టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని టీటీడీ ముందుగానే ప్రకటించింది. ఈ మేరకు ముందుగానే భక్తులకు టోకెన్లు, టికెట్లను కూడా టీటీడీ జారీ చేసింది. గత తొమ్మిది రోజులుగా టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. ఈ నేపథ్యంలో శని, ఆదివారాలకు సంబంధించి 50వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. అలాగే ఆన్లైన్లో 15వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది.
ఈ యేడాది సులువుగా టోకెన్లు లభించాయని.. అందుకే కుటుంబసమేతంగా తిరుమలకు వచ్చామంటున్నారు భక్తులు. గతంలో టోకెన్ల కోసం ఎన్నో ఇబ్బందులు పడేవారమని.. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా సులువుగా టోకెన్లు లభించాయని.. వైకుంఠ ద్వాద దర్శనాన్ని సామాన్య భక్తుల చెంతకు చేర్చిన టిటిడి ఛైర్మన్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.