హెచ్సీఏ కేసులో సీఐడీ దూకుడు

హెచ్సీఏ కేసులో సీఐడీ దూకుడుగా విచారిస్తుంది.హెచ్సీఏ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సీఐడీ అధారాలు సేకరించింది. 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్లు గుర్తించింది.
అయితే, వీరికి హెచ్సీఏలో ఓటు హక్కు ఉందా? ఎలాంటి అర్హతలతో ఓట్లు వేశారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తుంది. ఫోర్జరీ సంతకాలు, డాక్యుమెంట్లతో అధ్యక్షుడిగా ఎన్నికైన కేసులో జగన్మెహన్రావు, హెచ్సీఏ ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె శ్రీచక్ర, క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, సెక్రటరీ రాజేందర్ యాదవ్ను ఈ నెల 9న సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
కోర్టు అనుమతితో ఆరు రోజుల పాటు సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించారు. నేడు కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత కీలక సమాచారం సేకరించాల్సిన నేపథ్యంలో మరో 5 రోజులపాటు కస్టడీకి అనుమతివ్వాలని కోరనున్నారు.
జగన్మోహన్ రావు సహా ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కాంటె విచారణలో సీఐడీ అధికారులు కీలక సమాచారం సేకరించినట్లు తెలిసింది. కస్టడీలో ఉన్న ఈ ముగ్గురిని సీఐడీ అధికారులు ఉప్పల్ స్టేడియంలోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, హెచ్సీఏ ప్రధాన కార్యాలయంలో 3 రోజుల పాటు విచారించారు. క్రికెట్ క్లబ్స్ లేదా ఇన్స్టిట్యూషన్ తరఫున ఎవరెవరు ఓటు వేయాలనే వివరాలతో జస్టిస్ లావు నాగేశ్వర్రావు ఇచ్చిన లిస్ట్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఆ లిస్ట్లో ఉన్న వారు మాత్రమే హెచ్సీఏ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు.
తెలంగాణ క్రికెట్అసోసియేషన్, గౌలిపుర క్రికెట్ క్లబ్ సహా హెచ్సీఏ అధ్యక్ష ఎన్నికకు గల మాన్యువల్, బీసీసీఐ విధివిధానాలకు సంబంధించిన రికార్డులను సీఐడీ అధికారులు సేకరించారు. ప్రధానంగా ఫోర్జరీ సంతకాలు, ఇతర డాక్యుమెంట్లతో జగన్మోహన్రావు ఎన్నికకు పూర్తి వివరాలతో నిందితులుసహా ఆఫీస్ బేరర్లు, వివిధ క్రికెట్అసోసియేషన్ల అధ్యక్షులు, సభ్యుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. జగన్మోహన్రావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన హెచ్సీఏ నిధుల దుర్వినియోగం సహా ఐపీఎల్ టికెట్ల విక్రయాలు, క్యాటిరింగ్ కాంట్రాక్టుల గురించి సీఐడీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది.