Chandrababu: రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

Chandrababu: రాష్ట్ర వ్యాప్తంగా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. నేషనల్ హైవేలు, పీపీఏ విధానంలో చేపట్టే రహదారుల నిర్మాణంపై అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పని చేయాలని సూచించారు. అప్పుడు ఏపీ అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో రహదారుల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సంవత్సరం 1,040 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం లక్ష్యం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన అన్ని రాష్ట్ర, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, అటవీ, వన్యప్రాణి క్లియరెన్స్ సమస్యలు జూలై నెలాఖరుకు పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం వేగవంతంగా జరిగేలా చూడాలని చెప్పారు. వివిధ రహదారి ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించారు.
నిర్ణీత కాలవ్యవధికి మించి ఆలస్యమైన ప్రాజెక్టుల కాంట్రాక్ట్ సంస్థలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఇకపై ఏ రహదారి నిర్మాణమూ ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. మరోవైపు ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద 11వేల 325 కోట్లతో 770 కి.మీ రహదారులు గత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం 8వేల 744 కిలోమీటర్ల వరకు రహదారులు ఉండగా వీటిలో 4వేల 406 కి.మీ మేర ఎన్హెచ్ఏఐ రహదారులు, పీఐయూ-ఎంఓఆర్టీహెచ్ పరిధిలో 641 కిలోమీటర్ల రహదారులు, అలాగే ఆర్ అండ్ బి కింద 3వేల697 కిలోమీటర్ల రహదారులు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్హెచ్ఏఐ, ఎంఓఆర్టీహెచ్ కింద 76వేల856 కోట్లతో 144 ప్రాజెక్టులకు చెందిన 3వేల483 కిలోమీటర్ల వరకు రహదారులు నిర్మాణంలో ఉన్నాయి.
మరికొన్నింటిని త్వరలో చేపట్టనున్నారు. వీటిలో ఎన్హెచ్ఏఐ కింద 1వేయి 392 కిలోమీటర్ల రహదారులు, 2వేల091 కిలోమీటర్ల ఎంవోఆర్టీహెచ్ రహదారులు ఉన్నాయి. ఇందులో ఈ సంవత్సరం 20వేల 067 కోట్ల విలువైన 1వేయి 040 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తి కావాలని ముఖ్యమంత్రి లక్ష్యం నిర్దేశించారు.
గుంతలు లేని రహదారులు కోసం గత ఏడాది నవంబర్లో 860.81 కోట్లతో ముఖ్యమంత్రి ప్రారంభించిన పనుల్లో 97 శాతం ఈ జూన్ 6 నాటికి పూర్తయ్యాయి. 19వేల475 కిలోమీటర్ల మేర రహదారుల్లో గుంతలన్ని పూడ్చి.. మరమ్మతులయ్యాయి. మిగిలిన రహదారుల మరమ్మతులు జూలై 31 నాటికి పూర్తికానున్నాయి.