Chandrababu: వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారని ఊహించలేదు

Chandrababu: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖలో జరిగింది. గీతం వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం నేతలు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఈ కార్యక్రమ వేదికపై ఆసక్తికర సన్నివేశం జరిగింది. తోడల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు రావడం సంతోషకరమన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తమ మధ్య విబేధాలు ఉన్నమాట వాస్తవమేనన్నారు. విబేధాలున్నప్పటికీ కాలంతో పాటు ముందుకు సాగాలన్నారు.
ఎన్ని కష్టాలున్నా వెంకటేశ్వరరావు భయపడలేదన్నారు చంద్రబాబు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తమ ఫ్యామిలిలో విశిష్టమైన వ్యక్తి అన్నారు. వెంకటేశ్వరరావు పుస్తకం రాస్తారాని ఊహించలేదన్నారాయన. దగ్గుబాటి ఇప్పటికే నాలుగు పుస్తకాలు రాసారని ఇది ఐదో పుస్తకమన్నారు.
అలాగే వెంకయ్యనాయుడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడూ ముందుండే వ్యక్తి అన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగేందుకు పురందేశ్వరి చొరవ ఉపయోగపడిందన్నారు చంద్రబాబు. ఇటీవల ఎన్నికల్లో పురందేశ్వరి చూపించిన చొరవను అందరం చూశామన్నారు.