Chandrababu: తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు

Chandrababu: భారత్ – పాకిస్థాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. దేశ రక్షణలో పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్లతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు.
మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీరజవాన్ మురళి తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదని.. వారు ధైర్యంగా ఉండాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మురళి నాయక్ ఇంటికి వెళ్లి ప్రభుత్వం తరుపున జవాన్ తల్లిదండ్రులకు 5 లక్షల చెక్కు అందజేశారు.