సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీజేపీ విక్టరీ

BJP: ఆ నియోజకవర్గంలో కమలం పార్టీ అధికార పార్టీకి ధీటుగా పుంజుకుంది. ఆ లెక్కలు చూస్తే అసలు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు ఎంపీ ఎన్నికల్లో సాధించిన ఓట్లకు పొంతనే లేదంటే నమ్మండి. ఈ నేపథ్యంలోనే కేడర్ పెరిగింది. పార్టీలో జోష్ పెరిగింది. అయితే కార్యకర్తలను నడింపించేందుకు లీడర్ ఎక్కడంటే మాత్రం పక్క చూపులకే పరిమితమవుతున్న పరిస్థితి. ఏ చిన్న పనైనా నియోజకవర్గస్థాయి లీడర్ లేక ఆ పార్లమెంటు ఎంపీనే ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొందట. ఇంతకీ కమలానికి ఇంత కష్టం తెచ్చి పెట్టిన నియోజకవర్గం ఎక్కడ..?
కృష్ణా-తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న నేల అది. విభిన్న సంస్కృతులకు సమ్మేళనం తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిపి ఉండే మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. పాలమూరు జిల్లాకు చెందిన లేదా ఈ ప్రాంతం నుంచి ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు ఎందరో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకపాత్ర పోషించారు.
ఉమ్మడి జిల్లాలోనే కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్ మహబూబ్ నగర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ త్రిముఖ పోటీ ఉంటుందని భావించినా ఎన్నికల ఫలితాలు చూస్తే కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లే సాగింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హస్తం పార్టీ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు.
నాటి బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి మూడోస్థానానికి పరిమితమయ్యాడు. అయితే అసెంబ్లీ లెక్కలు అలా ఉన్నా ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అనుహ్యంగా పుంజుకొని సత్తా చాటింది.
మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానానికి రాష్ట్రంలో అధికార పార్టీగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటే కేంద్రంలో అధికార పార్టీగా బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. ఇక పార్లమెంట్ సెగ్మెంట్ లో కమలం విరబూయడంతో బీజేపీ క్యాడర్ లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో కంటే నాయకుల్లోనూ రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది.
అయితే ఎంపీగా బలమైన నాయకురాలు డీకే అరుణ ఉన్నప్పటికీ పాలమూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆ స్థాయి నేతలు కనిపించడం లేదు. ఎన్నికల ముందు కీలక నేత ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి హస్తం పార్టీలోకి మారారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన కుమారుడు మిథున్ రెడ్డిని సైతం వెంట తీసుకెళ్లాడు.
ఎలాగో ఎంపీగా డీకే అరుణ ఉన్నారు క్యాడర్ లో జోష్ కనిపిస్తోంది. దీంతో వచ్చే స్థానిక సంస్థల్లో పోటీకి కార్యకర్తలు, నాయకులు ఆశ చూపిస్తున్నారు. అయితే వారిని నడిపించే నాయకుడు మాత్రం కనిపించడం లేదు. ప్రతీ అంశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నా ఎంపీ డీకే అరుణ స్పందించాల్సిన అవసరం ఏర్పడుతోంది.
చిన్న చిన్న అంశాలు చెప్పుకుందామంటే ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయి నాయకులు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందట. దీంతో ఇప్పటి నుంచే ఆ స్థాయి నేతల కోసం ప్లాట్ ఫాం ప్రిపేర్ చేసుకోకపోతే మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయని కమలం శ్రేణుల్లో చర్చ నడుస్తోందట.
మరోవైపు నియోజకవర్గ లీడర్ని నియమించలేకపోగా ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ‘ఢిల్లీ’ ఆదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముహుర్తాలు మారుతున్నాయే తప్ప మోక్షం కలగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణయాల్లో నాన్చివేత ధోరణిపై పార్టీల్లో కార్యకర్తలు, నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. కార్యకర్తలు కాళ్లు అరిగేలా అధిష్టానం చుట్టూ తిరుగుతున్నా ఇప్పుడు అప్పుడు అంటూ నాన్చడమే తప్ప నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎంపీగా సొంత పార్టీ వారే ఉన్న నేపథ్యంలో కీలకంగా ఉన్న పాలమూరు అసెంబ్లీ స్థానంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సి అవసరం ఉందని నేతలు భావిస్తున్నారట. ఇక శ్రేణుల్లో ఉన్న జోష్ ను తగ్గకుండా అందరినీ సమన్వయం చేసుకునే నాయకుల కోసం కమలం పార్టీ చూస్తోందట. మరీ దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.