AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. చంద్రబాబు అధ్యక్షతన భేటీ

AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 11గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ప్రారంభంకానుంది. ఇందులో భాగంగా ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన పరిశ్రమలకు భూ కేటాయింపులపై పచ్చజెండా ఊపనుంది. అలాగే పెరిగిన రిజిస్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైనా చర్చించి నిర్ణ యం తీసుకోనున్నారు.
జనవరి 30న రాష్ట్ర పెట్టుబడుల పోత్సాహాక మండలి భేటీలో 15 ప్రాజెక్ట్లకు ఆమోదం తెలిపారు. ఇందులో భాగంగా 44వేల 776కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు పచ్చజెండా ఊపారు. ఈ ప్రాజెక్ట్లకు మంత్రివర్గంలోనూ ఆమోదం తెలియజేయనున్నారు. అల్లూరి జిల్లాలో 14వేల 328కోట్లతో 2వేల 300 మెగావాట్ల ప్రాజెక్ట్ను నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనతో పాటు అన్నమయ్య జిల్లాలో 10వేల 300 కోట్లతో మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఏర్పాటు చేయనున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్కూ కేబినెట్ గ్రీన్సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాకినాడ, అనంతపురం, సత్యసాయితోపాటు కడపజిల్లాలో ఏర్పాటయ్యే ప్రాజెక్ట్లను ఆమోదించే అవకాశం ఉంది.
ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల ఒకటి నుంచి రాష్ట్రంలో పెరిగిన భూముల రిజి స్ట్రేషన్ ఛార్జీలకు ఆమోదం తెలపనుంది. అలాగే జగన్ జమానాలో ఫ్రీ హోల్డ్ చేయబడిన.. 22ఏ భూముల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం కన్పిస్తోంది.