ఆంధ్ర ప్రదేశ్

AP News: చంద్రబాబు తర్వాత.. సీఎం పదవి ఆయనకే..

AP News: ఏపీలో రాజకీయాలు ఊహించిన దానికంటే శరవేగంగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు తర్వాత సీఎం ఎవరు అవుతారన్నే ప్రశ్న సర్వత్రా చర్చకు దారి తీసింది. మరోవైపు చంద్రబాబు తర్వాత ఆ పదవిని లోకేష్ కే ఇవ్వాలన్న డిమాండ్లు వెలువడుతున్నాయి. మరీ సీఎం పదవిని లోకేష్ ఇస్తే మరీ డిప్యూటీ సీఎం పవన్ పరిస్తితి ఏంటి? అసలు చంద్రబాబు తర్వాత అనే ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయి.

ఏపీ రాజకీయాలు అన్నింటికనన్ ప్రత్యేకం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. అయితే సీఎం చంద్రబాబు తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా నారా లోకేష్ దూసుకొస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా నారా లోకేష్‌కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన లోకేష్ ప్రస్తుతం ఫుల్ యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవల వాట్సాప్ గవర్నెన్స్ కూడా తెచ్చి పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. తద్వారా చంద్రబాబు తర్వాత సీఎం పదవిని ఆయనకే ఇవ్వాలనే డిమాండ్లు ఉన్నాయి.

కాగా మార్చి 6న విశాఖలో తన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన బుక్ ప్రపంచ చరిత్రను ఆవిష్కరించిన సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నానని చంద్రబాబే స్వయంగా అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పని హాయి, ఎప్పుడూ కూల్‌గా ఉంటారు.

ఏ సమస్యలూ లేవు. రాజకీయాల నుంచి తప్పుకొని హాయిగా ఉంటున్నారు. రోజూ ఎలా గడుస్తుందని అడిగితే ఆ విషయాలు నాతో చెప్పారు. నేను కూడా రిటైర్మెంట్ తర్వాత ఎలా గడుస్తుంది అనేది ఆలోచిస్తున్నాను. అందుకోసమే ఆయనకు ఎలా గడుస్తుందో తెలుసుకున్నాను” అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఇక సీఎం వ్యాఖ్యల్ని బట్టి ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారని స్పష్టమవుతోంది. చంద్రబాబుకి 74 ఏళ్లు ఉద్యోగులకు 60 ఏళ్లకే రిటైర్మెంట్ ఉంటుంది. కానీ రాజకీయాల్లో ఉండదు. ఐతే చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ చాలా యాక్టివ్‌గా ఉన్నారు. చెప్పాలంటే ఈ హుషారే ఆయన్ని నాలుగోసారి సీఎం చేసింది. ఆయన కంటే యంగ్‌ అయిన వైఎస్ జగన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హుషారు చూపలేకపోయారు.

దాంతో ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఇప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు 2029 వరకూ సీఎంగా కొనసాగితే అప్పటికి ఆయన వయస్సు 78 ఏళ్లు అవుతుంది. ఆ వయసులో ఆయన యాక్టివ్‌గా ఉండే అవకాశాలు తక్కువ. అందుకే ఆయన రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు 2027లో జరిగితే అప్పుడు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంటుంది. లేదా 2029లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా మరో 15 ఏళ్ల పాటూ కూటమి పార్టీలు కలిసే ముందుకు సాగుతాయని ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. తద్వారా ఎన్నికల్లో మళ్లీ కలిసే వెళ్తామనే సంకేతాలు ఆయన ఇచ్చారు. ఐతే సీఎం చంద్రబాబు నెక్ట్స్ ఎన్నికల నాటికి రిటైర్మెంట్ ప్రకటిస్తే తిరిగి కూటమి పార్టీలే అధికారంలోకి వస్తే అప్పుడు సీఎం ఎవరు అనేది చర్చగా మారింది.

మామూలుగా అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు తర్వాత సీఎంగా ఆయనే అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఈ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకోకపోతే, కూటమి పార్టీల్లో కల్లోలం రావచ్చు. ఐతే ఇవన్నీ ఇప్పుడే అంచనాలు వేసుకోవడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు.

సీఎం సీటు సంగతి అలా ఉంచితే టీడీపీకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కీలకం. ఇదివరకు వైసీపీ పాలన ఉన్నప్పుడు నారా లోకేష్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. పైగా అప్పుడు ఆయన మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయారు. పైగా టీడీపీ అప్పుడు అధికారంలో లేదు. కానీ ఎక్కడ ఓడారో అక్కడే ఆయన మళ్లీ భారీ మెజార్టీతో గెలిచారు.

అంతేకాకుండా యువగళం పాదయాత్ర చేసి, ప్రజల్లోకి వెళ్లి, వారి కష్టాలు తెలుసుకున్నారు. ఇవన్నీ ఆయన్ని రాజకీయాల్లో రాటుదేలేలా చేశాయి. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో కూడా గట్టిగానే వాయిస్ వినిపిస్తూ టీడీపీ వారసుడిగా తన బ్రాండ్ పెంచుకుంటున్నారు. పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఇలాగే సాగితే ఈ నాలుగేళ్లలో ఆయన మరింత రాటుదేలగలరు.

ఒకవేళ 2029లో చంద్రబాబు రిటైర్మెంట్ ప్రకటిస్తే అప్పుడు నారా లోకేష్ పార్టీని నడిపించే బాధ్యతను తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆ పార్టీకి అతిపెద్ద ఛేంజ్ ఓవర్ అవుతుంది. ఇలా చంద్రబాబు చేసిన రిటైర్మెంట్ ఆలోచన ప్రకటన రాజకీయాల్లో చర్చగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button