Chandrababu: సీఎం చంద్రబాబుకు ఐబీవీ వెన్నుపోటు

Chandrababu: ఒకప్పుడు సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. కానీ నేడు వ్యతిరేక గళం వినిపిస్తున్నాడు. చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు చంద్రబాబుతో సన్నిహితంగా ఉండటం కారణంగా గత జగన్ ప్రభుత్వం నుంచి వేధింపులను ఎదుర్కొని తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కేసుల నుంచి విముక్తి పొందాడు ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించారు. ఆయనకు సముచిత గౌరవం ఇచ్చారు. అయినప్పటీ ఆ పదవిని తిరస్కరించి చంద్రబాబును విమర్శించడం ప్రారంభించాడు. ఇంతకీ ఎవరా వెన్నుపోటుదారుడు…? ఆయన ఇలా మారడానికి కారణం ఏంటి..?
ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. ఆయనే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వర్ రావు. కానీ… ఇప్పుడు ముఖ్యమంత్రికి ఇరుకునపెడుతున్నారు. చంద్రబాబుతో సన్నిహితంగా ఉండటం కారణంగా గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వేధింపులను ఎదుర్కొన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని కేసుల నుండి విముక్తి పొందారు.
ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించారు. అలాగే ఆయన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా ఇచ్చింది. అయినప్పటికీ ఆయన ఆ పదవిని తిరస్కరించారు. చంద్రబాబుతో ఉన్న అనుబంధం కారణంగా అయినా ఏబీవీ నాయుడు విధేయుడిగా ఉంటారని భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. నమ్మిన చంద్రబాబునే నట్టేట ముంచేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబును, ప్రభుత్వ కొన్ని విధానాలను బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టాడు.
ఇటీవల చంద్రబాబు కీలక ప్రాజెక్టు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించడానికి ఏబీవీ మేధావులు , రిటైర్డ్ అధికారుల బృందంతో చేతులు కలిపారు. మాజీ అధికారి కంభంపాటి పాపారావు, రచయిత అక్కినేని భవానీ ప్రసాద్, కార్యకర్త టి లక్ష్మీనారాయణతో కలిసి మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ పై భారంగా ఉందని విమర్శించారు. రాజకీయ, కాంట్రాక్టర్ ప్రయోజనాల వల్ల, ముఖ్యంగా మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రయోజనాల వల్ల ఇది జరిగిందని ఆరోపించారు.
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు ప్రయోజనం చేకూర్చదని బదులుగా కాంట్రాక్టర్లు, రాజకీయ ప్రముఖుల ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని ఏబీవీ వాదించారు. రాష్ట్ర దీర్ఘకాలిక నీటి హక్కులు – ముఖ్యంగా కృష్ణా నది నుంచి ప్రమాదంలో ఉన్నాయని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు తెలుగు గంగ, గాలేరు-నగరి, కె.సి. కెనాల్ వంటి ఇప్పటికే ఉన్న రాయలసీమ నీటిపారుదల పథకాలకు ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు.
అదనపు నీటిపారుదల సామర్థ్యం లేనప్పటికీ నిర్వహణ ఖర్చులు మాత్రమే ఎకరానికి సంవత్సరానికి 50 వేల కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. గోదావరి నీటిని బొల్లాపల్లి ద్వారా సోమశిలకు బదిలీ చేయడం వంటి గురుత్వాకర్షణ ఆధారిత ప్రత్యామ్నాయాలు మరింత ఆచరణీయమైనవి ఖర్చుతో కూడుకున్నవి అని ఏబీవీ సూచించారు.
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టును మేఘ కృష్ణారెడ్డి రూపొందించారని, 82వేల కోట్ల పథకాన్ని ముందుకు తీసుకెళ్లాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరికీ సూచించారని ఆయన ఆరోపించారు. గాలేరు–నగరి వ్యవస్థ, వెలిగొండ సొరంగం వంటి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న గ్రావిటీ-ఆధారిత ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, గోదావరికి అనవసరమైన మళ్లింపులను నివారించడం ద్వారా కృష్ణా నీటి హక్కులను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంట్రాక్టర్లతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న వరుస ప్రభుత్వాలు ప్రోత్సహించిన ఈ ప్రాజెక్టు ఎటువంటి స్థిరమైన ప్రయోజనాలను అందించదని, బదులుగా ఆంధ్రప్రదేశ్ నీటి భద్రత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని బెదిరిస్తుందని వారు తేల్చారు. ఈ ప్రాజెక్టు గత, ప్రస్తుత ప్రభుత్వాలకు అనుకూలమైన కాంట్రాక్ట్ సంస్థ ఆధ్వర్యంలోనే జరుగుతోందని, అందుకే వైసీపీ కూడా ప్రశ్నించడం లేదని ఆయన ఆరోపించారు. లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు ప్రజలు, మేధావులు, నిపుణులతో ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
కాగా ఈ ప్రాజెక్ట్ పోలవరం జలాశయం నుంచి బనకచర్ల రెగ్యులేటర్ దాకా 200 Tmcft నీటిని తరలించేందుకు రూ.81 వేల కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ స్కీమ్ అనేది రాయలసీమ, కడప, కర్నూలు, చిత్తూర, అనంతపురం జిల్లాలకు నీటిపారుదల, తాగునీరు అందిస్తూ ఆ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడుతుంది. బొల్లపల్లి జలాశయం, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ల ద్వారా గోదావరి నీటిని బనకచర్లకు తరలించేలా ప్రణాళిక వేశారు.
ఈ ప్రాజెక్టు నుంచి వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని సముద్రంలో వృథాగా పోయే నీటిని ఆదా చేయవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల రాయలసీమలో వ్యవసాయం, ఉద్యానవన రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆయన భావిస్తున్నారు. ఆర్థిక వృద్ధికి ఇది దోహదపడుతుందని అంటున్నారు.
అయితే బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ఈ ప్రాజెత్టు గోదావరి నీటి వివాదాల ట్రైబ్యునల్ అవార్టు 1980, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ స్కీమ్ కోసం సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నుంచి పర్మిషన్లు లేకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని అభ్యంతరం చెబుతోంది. మరోవైపు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉండే రైతులకు శాశ్వత నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను 299 టీఎంసీలుగా నిర్ణయించి.. ఏపీకి 512 టీఎంసీ ఇచ్చిందంటూ కూడా విమర్శించారు. ఇదిలాఉండగా ఏపీ సర్కార్ ఈ ప్రాజెక్టు కోసం జల హారతి కార్పొరేషన్ అనే స్పెషల్ పర్పస్ సంస్థను ఏర్పాటు చేసింది.
అయితే గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు ఇబ్బంది ఉండదని తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లను రెండు రాష్ట్రాలు వాడుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. 3000 టీఎంసీలు నీళ్లు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇందులో కొంత మొత్తం వాడుకున్నా… తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
బనకచర్ల అంశం రెండు రాష్ట్రాల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉంటే అగ్గికి ఆజ్యం పోసేలా ఉన్నాయి ఏబీవీ వ్యాఖ్యలు. బనకచర్ల ప్రాజెక్ట్ను వ్యతిరేకిస్తూ ఏబీ వెంకటేశ్వర్ రావు వ్యతిరేకగళాన్ని వినిపిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలతో చంద్రబాబు చికాకు పడుతున్నారు. ఇక చూడాలి మరీ చంద్రబాబును చికాకు పెడుతున్న వీబీవీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా…? లేదా ..? అనేది.