YS Sharmila: ఈసారైనా అమరావతి కట్టేనా? లేక మళ్ళీ మట్టేనా?

YS Sharmila: ప్రధాని మోడీపై ఏపీసీసీ చీఫ్ షర్మిల ఎక్స్లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈసారైనా అమరావతి నిర్మాణం జరుగుతుందా లేక మళ్లీ మట్టి మాత్రమేనా అంటూ షర్మిల సూటిగా ప్రశ్నించారు. పదేళ్ల క్రితం శంకుస్థాపన పేరుతో మట్టి తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో కొట్టారని, ఆశలపై నీళ్లు చల్లి వెళ్లారని ఆమె ఆరోపించారు. ఇప్పుడు రాజధాని పునఃశంకుస్థాపన పేరుతో వస్తున్న మోడీకి, గత హామీలను గుర్తు చేయడానికే ఈ అమరావతి మట్టిని బహుమతిగా పంపిస్తున్నామని షర్మిల తెలిపారు.
ఈ మట్టిని చూసిన ప్రతిసారీ 2015 నాటి శంకుస్థాపనలో ఇచ్చిన హామీలను గుర్తు చేసుకోవాలని, పదేళ్లుగా జరిగిన జాప్యంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆమె హితవు పలికారు. మరోసారి ఆంధ్రులను మోసం చేయబోనని ఆయన స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఢిల్లీని మించిన రాజధానిని నిర్మిస్తానని ప్రధాని లిఖితపూర్వకంగా సంతకం చేసి ఇవ్వాలని అన్నారు.