YS Jagan: జగన్కు క్రేజ్ పెరుగుతోందా.. ప్రజలు మళ్లీ ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నారా..!

YS Jagan: వైసీపీ అధినేత జగన్కు క్రేజ్ పెరుగుతోందా..! ఏపీలో ప్రజలు మళ్లీ ఫ్యాన్ పార్టీ వైపు చూస్తున్నారా..! జగన్ పర్యటనలకు అంతలా జనం ఎందుకు తరలి వస్తున్నారు..! కూటమి పాలన మీద వ్యతిరేకత వ్యక్తమవుతోందా..! వైసీపీ అధినేత టూర్లకు వస్తున్న జనాధరణను ఏ విధంగా చూడాలి..? జగన్ను అడ్డుకోవడంలో.. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అవుతోందా..? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ…
వైసీపీ అధినేత జగన్కు జనాధరణ పెరుగుతోందట. జగన్ పర్యటనలకు పెద్ద ఎత్తున జనం తరలి రావడమే ఇందుకు నిదర్శనమని వైసీపీ శ్రేణులు అంటున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారీ కాన్వాయ్తో రెంటపాళ్లకు చేరుకున్న జగన్కు దారి పొడవునా పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
జగన్ పర్యటన సందర్భంగా సత్తెనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్తోపాటు 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. అదేవిధంగా కాన్వాయ్లో మూడు వాహనాలకే అనుమతి ఇచ్చారు. అయితే జగన్ పర్యటనకు భారీగా వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు.
భారీ కాన్వాయ్తో జగన్ రెంటపాళ్లకు చేరుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో రెంటపాళ్ల చుట్టుపక్కల 25 పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.. వైసీపీ శ్రేణుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ జన ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయారు.
జగన్ పర్యటన సందర్భంగా పలు చెదురుమదురు ఘటనలు జరిగాయి. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది యత్నించారు. మున్సిపల్ సిబ్బందిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో సత్తెనపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు నందిగామ అడ్డరోడ్డు దగ్గర గో బ్యాక్ జగన్, అమరావతి ద్రోహి జగన్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణ పడ్డారు.
జగన్ ఎక్కడికెళ్లినా ప్రజలు వెల్లువలా తరలి వస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జగన్ పర్యటన సందర్భంగా ప్రజలు భారీగా తరలి వచ్చారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. పొదిలిలోని పొగాకు బోర్డును జగన్ సందర్శించారు. పొగాకు రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
అయితే నిరసనలతో జగన్ ఇమేజ్ను తగ్గించాలని తెలుగు తమ్ముళ్లు భావించారట. నల్ల బెలూన్లతో నిరసన తెలపడం జగన్ కాన్వాయ్పై చెప్పులు, రాళ్లు విసరడం చేశారట. అయితే.. అవేమీ వర్కవుట్ కాలేదనే టాక్ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది.
వైసీపీ అధినేత జగన్ గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ పర్యటించినప్పుడూ జనం నుంచి అపూర్వ స్పందన వచ్చింది. జగన్ పర్యటనకు ప్రజలు అంతగా తరలి రావడాన్ని తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు విశ్లేషకులు. ఇచ్చిన హామీల్ని ఎలా నెరవేర్చాలనే దానిపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడంతో ప్రజల్లో సానుకూలత క్రమంగా తగ్గిపోతోందట.
వ్యక్తిగత కక్ష తీర్చుకోడానికి కూటమికి అధికారం ఇచ్చినట్లైందనే భావన ప్రజల్లో పెరుగుతూ వస్తోందట. ఈ నేపథ్యంలోనే సార్వత్రిక ఎన్నికలు వెలువడిన జూన్ 4న వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందట.
మొత్తానికి పోలీసులు అనేక ఆంక్షలు విధించినా.. జగన్ మాత్రం తన పంథాలో పల్నాడు పర్యటన ముగించారు. మరి ఎక్కువ మందిని సమీకరిస్తే చర్యలు తప్పవన్న పోలీసులు ఇప్పుడేం యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాలి.