నేరం

నీ సంతోషమే నాకు ముఖ్యం.. ప్రియుడికి మెసేజ్ పెట్టి ప్రియురాలు ఆత్మహత్య

ఇంట్లో గొడవల వల్ల తాను విసిగిపోయానని, తనను క్షమించాలని, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుతూ ప్రియుడికి వీడియో రికార్డింగ్ పెట్టి.. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. విషాదకర ఈ ఘటన గుజరాత్‌లో మూడు రోజుల కిందట చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బనస్కాంత జిల్లాకు చెందిన రాధా థాకూర్ (27) కొన్నేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి తన సోదరి అల్కా వద్ద ఉంటూ సొంతంగా బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే, ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటనపై సోదరి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఓ ఫొటోను పంపించాలని రాధ అడిగినా అతడు పంపలేదని కుటుంబసభ్యులు ఆరోపించారు. ‘7 గంటల్లోపు ఫొటో పంపకుంటే ఏం జరుగుతుందో చూడు’ అని ఆమె అన్నట్లు వీడియో రికార్డింగ్‌లో పోలీసులు గుర్తించారు. అలాగే, ఇంకో వీడియోలో.. ‘‘నన్ను క్షమించు.. నీ అనుమతి తీసుకోకుండా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా… నువ్వు బాధపడొద్దు. జీవితాన్ని ఆస్వాదించి.. ఆనందంగా ఉండు. వివాహం చేసుకో. రెండు చేతులు జోడించి క్షమించమని వేడుకుంటున్నా… నువ్వు ఆనందంగా ఉంటేనే నా ఆత్మకు శాంతి. పని, జీవితం పట్ల ఒత్తిడితో ఉన్నందునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నా’’ అని రాధ వాపోయింది.


ఈ ఘటనపై రాధ సోదరి ఆల్కా స్పందిస్తూ.. ‘‘మా సోదరి బ్యూటీపార్లర్‌ నడుపుతోంది. ఆదివారం రాత్రి పార్లర్ నుంచి ఇంటికి వచ్చి. డిన్నర్ చేసి నిద్రపోయింది. తెల్లారేసరికి చనిపోయి ఉంది.. మొబైల్ ఫోన్‌ పరిశీలించగా రికార్డు చేసిన కొన్ని వీడియోలు కనిపించాయి.. ప్రతిదీ మేము పోలీసులకు అందజేశాం.. రాధ తరుచూ మాట్లాడుతున్న వ్యక్తిపైనే మాకు అనుమానం ఉంది’’ ఆమె తెలిపారు. రాధ కుటుంబం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అసలు ఆమె ఆత్మహత్య చేసుకోడానికి గల కారణం ఏంటి? అవతలి వ్యక్తికి ఎందుకు క్షమాపణ చెప్పింది? తదితర వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button