ఆంధ్ర ప్రదేశ్
Nandyala: కబడ్డీ ఆడుతుండగా.. గుండెపోటుతో యువకుడి మృతి

Nandyala: నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తుడిచర్ల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డి పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. జూపాడు బంగ్లాకు చెందిన క్రీడాకారుడు కొప్పెర శ్రీరాములు అనే యువకుడు కబడ్డీ ఆడుతూ ఆట మధ్యలోనే కుప్పకూలిపోయాడు. క్రీడాకారుని ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యమంలోనే మృతి చెందాడు. గుండెపోటుతో మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
దీంతో ఒక్కసారిగా తుడిచర్ల, జూపాడు బంగ్లా లో విషాద ఛాయలు అలుముకున్నాయి. క్రీడాకారుడి మృతికి సంతాపంగా మిగిలిన ఆటను రద్దు చేసి విజేతగా జూపాడు బంగ్లా జట్టును ఎంపిక చేసి బహుమతి మొత్తాన్ని, మెమొంటోను క్రీడాకారుడు శ్రీరాములు కుటుంబానికి అందజేశారు. క్రీడాకారుడి మృతదేహంపై మెమొంటోను ఉంచి దహన సంస్కరణలు నిర్వహించారు. క్రీడాకురుడి ఆకస్మిక మృతి అందరినీ కంటతడి పెట్టించింది.