Israel-Iran War: ఇరాన్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు .. 224 మంది మృతి

Israel-Iran War: ఇజ్రాయెల్ దాడుల్లో తమ దేశానికి చెందిన 224 మంది చనిపోయారని ఇరాన్ హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. అందులో 90% సాధారణ పౌరులే ఉన్నారని పేర్కొంది. మరో 1,277 మంది గాయపడ్డారని తెలిపింది. కాగా న్యూక్లియర్ సైట్లను లక్ష్యంగా చేసుకుని గత శుక్రవారం ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఇరాన్ సైనికాధికారులు, న్యూక్లియర్ సైంటిస్టులను హతమార్చుతోంది. అటు ఇరాన్ దాడుల్లో 14 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయినట్లు సమాచారం.
ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ రాజధాని ఖాళీ
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాల్లో అమాయక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోక తప్పట్లేదు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద ఇజ్రాయెల్ మిసైళ్లతో విరుచుకుపడటంతో ఆ నగరం మొత్తం ఖాళీ అవుతోంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సిటీని వదిలి దూరంగా వెళ్లిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి.
ఇజ్రాయెల్కు పాక్ అణు హెచ్చరికలు: ఇరాన్
ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇజ్రాయెల్తో యుద్ధంలో పాకిస్థాన్ తమకు పూర్తి మద్దతు తెలిపినట్లు ఇరాన్ జాతీయ భద్రతా కౌన్సిల్ మెంబర్ మొహ్సెన్ రెజాయ్ వెల్లడించారు. ‘ఒకవేళ ఇజ్రాయెల్ గనుక టెహ్రాన్పై న్యూక్లియర్ దాడి చేస్తే.. ఇజ్రాయెల్పై అణుబాంబు వేస్తామని పాకిస్థాన్ మాకు స్పష్టం చేసింది’ అంటూ ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చారు.
ట్రంప్ను చంపేందుకు ఇరాన్ ప్లాన్: నెతన్యాహు
US అధ్యక్షుడు ట్రంప్ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపించారు. అందుకే న్యూక్లియర్ ప్రోగ్రామ్పై తీవ్రంగా పనిచేసిందన్నారు. ట్రంపే ఆ దేశానికి మొదటి విలన్ అని పేర్కొన్నారు. తమకూ న్యూక్లియర్ ముప్పు ఉందని, ఇరాన్పై దాడి చేసి వాటిని ధ్వంసం చేయడం మినహా మరో అప్షన్ లేదని చెప్పారు. తన ఇంటిపై దాడి చేసినా పాలనపై ఫోకస్ చేశానని, ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.