జాతియం

Wah Taj Ad: జాకీర్ హుస్సేన్ “వాహ్ తాజ్” యాడ్ గుర్తుందా.. దాని వెనుక ఎంత కథ ఉందో తెలుసా?

Wah Taj Ad: నైంటీస్‌లో వచ్చిన వాహ్ తాజ్ యాడ్ గుర్తుందా. తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ చేసిన ఈ యాడ్ అప్పట్లో ఉర్రూతలూగించింది. ఇక ప్రతీ ఇంటినీ తలుపుతట్టిన ఈ యాడ్‌తో జాకీర్ హుస్సేన్ అందరికీ దగ్గరయ్యారు. ఎంతో ఫేమస్ అయిన ఈ యాడ్ వెనుక చాలా పెద్ద స్టోరీ ఉంది. మొదట ఈ యాడ్‌ కోసం వేరేవారిని సెలెక్ట్ చేసినా.. చివరికి ఆ అవకాశం జాకీర్ హుస్సేన్‌కే దక్కింది. ఈ క్రమంలోనే అసలు ఆ యాడ్ వెనుక సంగతి ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Zakir Hussain
జాకీర్ హుస్సేన్ “వాహ్ తాజ్” యాడ్ గుర్తుందా.. దాని వెనుక ఎంత కథ ఉందో తెలుసా?

Wah Taj Ad: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ అస్తమయంతో ఆయన 60 ఏళ్ల సుదీర్ఘ సంగీత ప్రయాణం ముగిసింది. జాకీర్ హుస్సేన్ లేకపోయినా ఆయనకు ఉన్న కళ రూపంలో అందరిలోనూ శాశ్వతంగా నిలిచిపోతారు అనేది అందరికీ తెలిసిందే. అయితే జాకీర్ హుస్సేన్ దేశం మొత్తం తెలియడంలో ఆయన తబలా వాయించడమే కాకుండా.. “తాజ్ మహల్ టీ” కంపెనీ చేసిన “వాహ్ తాజ్ టీ” యాడ్ కూడా ఎంతో చెప్పుకోదగ్గది. 1990ల్లో వచ్చిన ఆ వాహ్ తాజ్ యాడ్.. ఇప్పటికీ అందరికీ సుపరిచితమే. అయితే ఈ వాహ్ తాజ్ యాడ్‌ను జాకీర్ హుస్సేన్ చేయగా.. దాని వెనుక మాత్రం చాలా పెద్ద కథ ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ ఆగ్రాలో ఉన్న ప్రేమ చిహ్నం తాజ్‌మహల్‌ ముందు జాకీర్‌ హుస్సేన్‌ కూర్చుని తబలా వాయిస్తూ చేసిన ఈ వాహ్ తాజ్ యాడ్ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడాన్ని ఆస్వాదించి.. మైమరిచిపోయిన ఓ యువతి.. ఆయనకు కూడా ఒక కప్పు టీ అందిస్తూ “వాహ్‌ ఉస్తాద్‌” అని అంటుంది. అందుకు వెంటనే జాకీర్ హుస్సేన్.. “వాహ్‌ ఉస్తాద్‌ కాదు.. వాహ్‌ తాజ్‌ అనండి” అని చెబుతారు. అదే కాకుండా మరో యాడ్‌లో కూడా జాకీర్ హుస్సేన్ అదే చేశారు. ఒక బాలుడితో కలిసి జాకీర్ హుస్సేన్ తబలా వాయిస్తూ ఉంటారు. ఆ బాలుడి కళను అభినందిస్తూ “వాహ్‌ ఉస్తాద్‌” అని జాకీర్ హుస్సేన్ అంటారు. అందుకు ఆ బాలుడు “అరె హుజూర్‌, వాహ్‌ ఉస్తాద్‌ కాదు.. వాహ్‌ తాజ్‌ అనాలి” అనడంతో వారిద్దరూ ఒక్కసారిగా నవ్వుతారు.

అయితే జాకీర్ హుస్సేన్ ప్రదర్శన చూసినవారంతా ఆయనను “వాహ్‌ ఉస్తాద్‌” అని అభినందనలు చెబుతారు. దాన్నే కొద్దిగా మారుస్తూ హిందుస్థాన్‌ థాంప్సన్‌ అసోసియేట్స్‌ కంపెనీ ఈ వాహ్ తాజ్ యాడ్‌ను రూపొందించింది. అయితే ఈ తాజ్‌మహల్‌ టీని 1966లో కోల్‌కతాలో ప్రారంభించారు. ఈ యాడ్ కోసం ముందుగా జాకీర్‌ హుస్సేన్‌ కాకుండా.. హీరోహీరోయిన్లు జీనత్‌ అమన్‌, మాళవిక తివారీ కన్పించారు. అయితే హిందుస్థాన్‌ థాంప్సన్‌ అసోసియేట్స్‌లో కాపీరైటర్‌ కేఎస్‌ చక్రవర్తి.. ఒకసారి జాకీర్‌ హుస్సేన్‌ తబలా వాయించడం చూసి.. ఆయన అయితే ఇంకా బాగా యాడ్‌ చేస్తారని భావించి కంపెనీకి చెప్పారు.

దీంతో ఆ కంపెనీ జాకీర్‌ హుస్సేన్‌ను సంప్రదించగా.. ఆ యాడ్‌ ఆయనకు కూడా బాగా నచ్చింది. దీంతో ఆయన తన సొంత డబ్బులతో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆగ్రాకు వచ్చి.. ఆ యాడ్ చేశారు. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ వాహ్ తాజ్ యాడ్ ఉండేది కేవలం 30 సెకన్లు మాత్రమే. అయితే ఆ యాడ్ గురించి.. గతంలో జాకీర్ హుస్సేన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ యాడ్‌లో తాను 30 సెకన్లే కనిపించినా.. చాలామంది నన్ను గుర్తుపట్టేలా చేసిందని తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button