Vemulawada: ఏడో తేదీన వేములవాడ ఆలయం మూసివేత

Vemulawada: ఈనెల 7న సంభవించనున్న చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు అధికారులు తెలిపారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 25 నిమిషాల నుంచి 8వ తేదీ సోమవారం తెల్లవారు జామున 3 గంటల45 నిమిషాల వరకు ఆలయ మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు.
ఆదివారం ఉదయం శ్రీస్వామి వారికి మహా నివేదన సమర్పించిన అనంతరం 11 గంటల 30 నిమిషాలకు ఆలయం మూసివేసి, గ్రహణ మోక్షం అనంతరం తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు ఆలయ సంప్రోక్షణ ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామన్నారు.
ఈ రెండు రోజులపాటు భక్తుల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై 1గంట 26 నిమిషాల వరకు దాదాపు మూడున్నర గంటల పాటు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందన్నారు. శతభిష, పూర్వాభాద్ర నక్షత్రం, కుంభ రాశి వారు గ్రహణాన్ని చూడకూడదని గ్రహణ మోక్ష అనంతరం దానాలు నిర్వహించాలన్నారు. పిల్లలు వృద్ధులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని ఆలయ అర్చకులు తెలిపారు.



