Haryana: మతం దాచి పెళ్లి చేసుకుంటే పదేళ్లు జైలు

Haryana: హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మతాంతర వివాహాలపై హర్యానా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనుంది. కొందరు వారి మతం ఏంటని విషయం చెప్పకుండా దాచి ఇతరులను మోసం చేసి పెళ్లి చేసుకుంటారు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వారి మతం చెబుతున్నారు. అప్పుడు వారు ఏం చేయలేని పరిస్థితి. ఇలా మోసం చేస్తూ మతాంతర వివాహాలు విషయంలో హర్యానా ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
మతాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. దీనికోసం మతమార్పిళ్ల నిరోధక చట్టం 2022 ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ చట్టం ప్రకారం వివాహం కోసం జరిగే మతమార్పిడిని నిరోధిస్తారు. మతాన్ని దాచి పెట్టి వివాహం చేసుకుంటే.. అది చెల్లదని తెలిపింది. ఇలా ఎవరైతే మతం దాచి పెళ్లి చేసుకుంటారో వారికి జరిమానాతో పాటు పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని ప్రభుత్వం తెలిపింది.
సాధారణ చట్టవిరుద్ధ మతమార్పిడి చేస్తే ఒకటి నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే ఒక లక్ష రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అదే మతం దాచి కనుక పెళ్లి చేసుకుంటే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. అలాగే మూడు లక్షల జరిమానా కూడా ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది. మైనర్, మహిళ లేదా ఎస్సీ, ఎస్టీ వారి మతం మార్చి పెళ్లి చేసుకుంటే 4 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉండటంతో పాటు కనీసం 3 లక్షల జరిమానా ఉంటుంది.
సామూహిక మతమార్పిడి అంటే ఒకేసారి ఇద్దరు కంటే ఎక్కువ మందిని ఇలా మోసం చేస్తే దాదాపుగా 5 నుంచి10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు కనీసం 4 లక్షల జరిమానా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించి జరిగిన వివాహం నుంచి జన్మించిన ఏ బిడ్డనైనా చట్టబద్ధంగా పరిగణిస్తారు. పిల్లల వారసత్వ హక్కులు తల్లిదండ్రుల సాధారణ వారసత్వ చట్టాలను అనుసరిస్తాయని పేర్కొంది.
వ్యక్తిగత మత స్వేచ్ఛకు భంగం కలిగించడం లేదని, మోసం, బలవంతం లేదా చట్టవిరుద్ధంగా ఎవరైనా ఇలా చేయకుండా ఉండేందుకు ఈ చట్టం తీసుకొచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల మతమార్పిడి చేయడానికి ప్రయత్నించరని వెల్లడించింది.



