
యూనిటీ ఫౌండేషన్ నిన్న హైదరాబాద్లో జరిగిన పత్రికా సమావేశంలో మహిళల సాధికారత కోసం ఒక ప్రముఖ పథకాన్ని ఆవిష్కరించింది. మే 11, 2025న మదర్స్ డే సందర్భంగా ‘భారత్ పాఠశాల’ అనే ఆన్లైన్ విద్యా వేదికను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. బహుళ భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వేదిక, రాబోయే రెండేళ్లలో 1,00,000 మంది మహిళలకు డిజిటల్ నైపుణ్యాలు, వ్యవస్థాపకత, ఆర్థిక నిర్వహణ కోర్సులను ఉచితంగా అందజేయనుంది. గ్రామీణ, పట్టణ మహిళలకు స్వయం సమృద్ధి మార్గాన్ని సుగమం చేయడమే తమ ధ్యేయమని సహ వ్యవస్థాపకుడు శ్రీ వంశీ అందుకూరి తెలిపారు.
అదే వేదికపై ‘యూనిటీ డ్రైవ్ 2025’ గురించి సమాచారం పంచుకుంటూ, హైదరాబాద్ నుంచి హిమాచల్ ప్రదేశ్లోని స్పితి వ్యాలీ వరకు 4,000 కిలోమీటర్ల ఈ యాత్ర మే 15, 2025న ఆరంభం కావాల్సి ఉండగా, భౌగోళిక, రాజకీయ కారణాల వల్ల వాయిదా పడినట్లు సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా సురక్షిత సమయంలో కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వ్యవస్థాపకులు స్పష్టం చేశారు. మహిళల సాధికారత, రోడ్ సేఫ్టీ, సైబర్ అవగాహనలను ప్రోత్సహించే ఈ యాత్ర సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడనుంది.