TTD: రూ.5,258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీనివాసుడు కొలువైన దివ్య క్షేత్రం తిరుమల. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలివస్తూ ఉంటారు. స్వామి వారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తమ తాహతకు తగ్గట్లు చిల్లర నాణేల నుంచి బంగారు ఆభరణాల వరకు హుండీలో సమర్పించడం అనవాయితీగా వస్తుంది. సామాన్య భక్తులు అధికంగా సమర్పించే చిల్లర నాణాలే టీటీడీ వార్షిక బడ్జెట్ ఆధారపడి రూపొందిస్తారు ఆర్థిక శాఖ అధికారులు. సామాన్యుడంటే భక్త ప్రియుడికి ఎంత ఇష్టమో హుండీ కానుకల ద్వారానే తెలుస్తోంది. ఎందరో సంపన్నులు కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నా సామాన్యుడు హుండీలో వేసే కానుకలే బడ్జెట్ లో సింహ భాగంగా మారుతున్నాయి.
టీటీడీ ఆర్థిక 2025-26 వార్షిక బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. 2025-26 వార్షిక బడ్జెట్ అంచనా 5 వేల258.68 కోట్లుగా టీటీడీ అంచనా వేసింది. బడ్జెట్ అంచనా ప్రకారం ఇంజనీరింగ్ పనుల కొరకు 350 కోట్లు ఖర్చ చేయనుంది టీటీడీ. హిందూ ధర్మ ప్రచార పరిషత్ లో వివిధ ప్రాజెక్టులకు 121.50 కోట్లు వ్యయించనున్నారు. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్ కు 130 కోట్లు వ్యయించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి కామన్ గూడ్స్ ఫండ్స్, ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఫండ్స్, అర్చక వెల్ఫేర్ ఫండ్స్ కోసం 50 కోట్లు అందించనున్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కోసం 189 కోట్లు వ్యయించనున్నారు. హెల్త్ మరియు శానిటేషన్ కోసం 203 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం కోసం 191.00 కోట్లు ఖర్చు చేయనున్నారు. టీటీడీ లోని వివిధ హాస్పిటల్స్ అభివృద్ధి కోసం 156 కోట్లు కేటాయించారు.
ఇక హ్యూమన్ రిసోర్స్ కొరకు 1773.75 కోట్ల రూపాయలు వ్యయించనున్నారు. వివిధ రకాల ముడి సరుకు కొనుగోలుకు 768.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్విమ్స్ లో వివిధ ఇంజనీరింగ్ పనుల కొరకు 60 కోట్లు, స్విమ్స్ రెవెన్యూ గ్రాంట్ క్రింద మరో 60 కోట్లు విడుదల చేయనున్నారు. గరుడ వారధి కాపిటల్ వర్క్ కోసం 25 కోట్లు విడుదల చేయనున్నారు. ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ కోసం 150 కోట్లు, మేనేజ్మెంట్ సర్వీసెస్ కోసం 80 కోట్లు ఖర్చు చేయనున్నారు.పెన్షన్స్, ఈహెచ్ఎస్ కొరకు 130 కోట్లు, లోన్స్, అడ్వాన్స్ పేమెంట్స్ కొరకు 117.62 కోట్లు ఖర్చు చేయనున్నారు. విద్యుత్ చార్జీలకు 70 కోట్లు, ఇతర పనులకు 52.50 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇతర టాక్సులు, ఖర్చులు, నైపుణ్యం ఖర్చులు, పండుగల కొరకు 50.08 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇతర పర్యవేక్షణ ఖర్చులు 40 కోట్లు, టెండర్, పబ్లికేషన్ కి 8 కోట్లు వ్యయించనున్నట్లు టీటీడీ తెలిపింది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ ధనం 488.90 కోట్లుగా టీటీడీ వెల్లడించింది. ఇక హుండీ కానుకలు ద్వారా ఏడాదికి 1,729 కోట్ల ఆదాయం వస్తాయని అంచనా వేశారు. వివిధ రకాల వడ్డీల ద్వారా 1,310 కోట్ల రూపాయలు అదనంగా సమకూరనున్నట్లు తెలిపారు. ప్రసాదాల వితరణ ద్వారా రూ. 600 కోట్లు, కల్యాణకట్టలో సమర్పించిన తలనీలాల ద్వారా 176.50 కోట్లు ఆదాయం వస్తాయని అంచనా వేసింది టీటీడీ. గదుల కేటాయింపు, కల్యాణ మండపాల ద్వారా 157 కోట్లు వస్తుందని గణించారు.
ఆర్జిత సేవల ద్వారా 130 కోట్లు, స్పెషల్ ఎంట్రీ- విఐపీ బ్రేక్ దర్శనాల ద్వారా 310 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ట్రస్ట్ రిసిప్ట్స్ ద్వారా 90 కోట్లు, రెంట్, ఎలక్ట్రికల్ చార్జెస్, వాటర్ చార్జెస్ ద్వారా 66 కోట్లు, పబ్లికేషన్స్ ద్వారా 31 కోట్లు, అగరబత్తులు, ఇతర ప్రొడక్ట్స్ విక్రయం ద్వారా మరో 93.90 కోట్లు వస్తాయని అంచనా వేశారు. ఇతర కాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 129 కోట్లు రావచ్చని అంచనా. లోన్స్, అడ్వాన్స్ పేమెంట్స్ ద్వారా అదనంగా 76.38 కోట్లు వసూలు అవుతాయని లెక్కలు వేశారు.
శ్రీ వెంకటేశ్వర జూపార్క్ నుంచి కపిల్ తీర్థం వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని.. అదే తరహాలో టీటీడీ శ్రీవారికి సంబంధించినటువంటి భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదని తెలిపారు. టీటీడీ స్వామివారి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో టీటీడీ ఆలయ నిర్మాణాల కోసం శ్రీవాణి ట్రస్ట్ ఫండ్ను ఉపయోగిస్తామన్నారు. హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలని మరోసారి తీర్మానించామని తెలిపారు.
అన్ని రాష్ట్రాల రాజధానిలో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని అలాగే గ్రామాలు, పల్లెలు, పట్టణాల్లో ఆలయాల పునరుద్ధరణపై తీర్మానం చేశామని చెప్పారు. శ్రీవారి పోటు వర్కర్స్ కు 43 వేల రూపాయలు జీఎస్టీ లేకుండా పాస్ చేసే విధంగా బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతిలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేశామని పేర్కొన్నారు.
త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు చేస్తామన్నారు. సైన్స్ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు చేస్తామన్నారు. తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.