తెలంగాణ

భూముల కోసం ఏళ్ల తరబడి గిరిజనుల పోరాటం

సాగులో ఉన్న గిరిజనుల పట్టా భూముల్లో అటవీశాఖ పాగా వేసింది. గిరిజనులు ప్రాధేయపడ్డారు, బ్రతిమాలారు, చివరకు న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. ఆ భూముల విషయంలో కోర్టు కూడా గిరిజనులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయినా భూములు వీరికి దక్కడం లేదు. ఏళ్ల తరబడి పోరాటాలు చేసి అలసిపోయిన గిరిజనం చివరకు నిరాహార దీక్ష చేపట్టారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం పంచాయితీ గిరిజనులు స్థానిక తహశీల్దార్, అటవీశాఖ కార్యాలయాల వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రామన్న గుడెంలో ఉన్న 30, 36, 39 సర్వే నంబర్లులో ఉన్న 573.20 కుంటల భూమి విషయంలో గిరిజనులకు అటవీశాఖ మధ్య రెండు దశాబ్దాలుగా వివాదం ఉంది. కొన్నేళ్ల నిరీక్షణ అనంతరం కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పు కూడా ఇచ్చింది.

కానీ కోర్టు ఆదేశాలు అమలు అవకపోవడంతో సుమారు 150 కుటుంబాలు తమ భూమి తమకు కావాలని ఇప్పటికీ పోరాడుతూనే వున్నారు. 20 ఏళ్లుగా తహసీల్దార్ నుండి RDO, కలెక్టర్ వరకూ అందరినీ వేడుకుంటూనే వున్నారు. కానీ వారి గోడు ఎవరూ పట్టించుకోలేదు. పాదయాత్ర చేస్తే పోలీసులు లాఠీచార్జి చేసి అడ్డుకున్నారు. చివరికి విసిగిపోయిన గిరిజనులు ప్రాణాలు పోయినా సరే వెనుకడుగు వేయకుండా తమ భూములు తాము పొందాలని నిరాహార దీక్షలు చేపట్టారు.

కోర్టు ఉత్తర్వులు అనుసరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలంటూ చంటి పిల్లలతో వచ్చి నిరాహారదీక్ష చేపట్టారు. ఏజన్సీ నియోజకవర్గoలో ఇప్పటికి నలుగురు గిరిజన శాసన సభ్యులు ఉన్నా కూడా తమ గోస పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిహేడేళ్ళ క్రితం అంకమ్మ చెరువు కాలువల కోసం తమ భూముల్లో 72 ఎకరాలు ఇచ్చామని దానికి రావాల్సిన నష్టపరిహారం ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం తమ సమస్యను వెంటనే పరిష్కరించి జాయింట్ సర్వే చేసి తమ భూములు తమకు అప్పగించాలని గిరిజనులు కోరుతున్నారు. అంకమ్మ చెరువు నష్టపరిహారం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రంలోని ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సమ్మెను ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button