ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి తిరుమల లడ్డూ సిద్ధం

Tirumala: ఒంటిమిట్ట శ్రీ సీతా రాముల కల్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తోంది. 2014లో ఏపీ భద్రాద్రి ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలో కోదండరామ స్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది టీటీడీ. అప్పటి నుంచి రాములవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది.
ప్రతి ఏటా శ్రీ కోదండ రాముల వారి కల్యాణంలో రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారు. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లను చకచకా సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. భక్తులకు అన్న ప్రసాదాలను, తాగు నీరు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక శ్రీ కోదండ రామ స్వామి వారి కల్యాణానికి విచ్చేసే భక్తులకు లడ్డూ ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది.
భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈవో శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. ఒక్కో లడ్డూను ఒక్కో ప్రత్యేక బ్యాగులో పెట్టారు. కల్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకున్నారు.
ఎకో ఫ్రెండ్లీ పేపర్ బ్యాగుపై శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం తేదీ, స్వామి వారి ఉత్సవం విగ్రహాలను ముద్రించారు. కడప జిల్లా ఒంటిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల మధ్య అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతా రాముల కల్యాణంలో పాల్గొనే భక్తులకు లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.