ప్రపంచాన్ని వణికిస్తున్న ప్లాస్టిక్ భూతం

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలుష్యాల్లో ప్లాస్టిక్ భూతం ఒకటి. రోజురోజుకూ దీని ఉత్పత్తి, వినియోగం పెరిగిపోతున్నది. ప్రభుత్వాల నుంచి నియంత్రణ కరువైంది. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా భారత్లోని పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎందుకంటే ప్లాస్టిక్ వ్యర్థాల విడుదల, ప్లాస్టిక్ వినియోగం భారత్లో అధికంగా ఉన్నది.
దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ కాలుష్య కారక దేశంగా మారింది. ప్రకాశం జిల్లానూ ప్లాస్టిక్ భూతం వదలేట్లేదు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. జిల్లాలో వేగంగా విస్తరిస్తున్న ప్లాస్టిక్ భూతంపై రాజ్న్యూస్ ప్రత్యేక కథనం ..
మన నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడటం ఒక సాధారణ విషయంగా మారిపోయింది. పూలు, పండ్లు , ఏ వస్తువులను కొన్నా వాటిని ప్లాస్టిక్ కవర్లలోనే ఇస్తుంటారు వ్యాపారులు. మనం కూడా ప్లాస్టిక్ భూతం గురించి పట్టించుకోకుండా అదే ప్లాస్టిక్ కవర్లను తిరిగి మరోక అవసరాలకు వినియోగిస్తుంటాము. వ్యాపారస్ధులు వారి లాభాల కోసం నిషేదించిన ప్లాస్టిక్ వస్తువులను విక్రయిస్తుంటే, మనం మన అవసరాల కోసం వాటిని పదే పదే వినియోగిస్తూ కాలుష్యకారకులుగా మారుతున్నాం.
నిజానికి ప్లాస్టిక్ వల్ల పర్యావరణం చాలా దెబ్బతింటుంది. దీంతో గతంలోనే కోర్టులు ప్లాస్టిక్ కవర్లను నిషేదించాయి. వాటిని విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచాలని కోర్టులు ఆదేశించాయి. అయితే మొదట్లో అధికారులు ప్లాస్టిక్ వినియోగంపై సీరియస్ గా దృష్టి పెట్టినప్పటికి తర్వాత కొంతకాలానికి షరా మాములు అయిపోయింది.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్లాస్టిక్ వాడకం గతం కన్నా విపరీతంగా పెరిగిపోయింది. 50 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులు ప్రకృతికి తీవ్రంగా నష్టం చేస్తున్నాయి. జిల్లాలోని నగరపాలక సంస్ధతో పాటు, పట్టణాల్లో ప్లాస్టిక్ వాడకాన్నీ అధికారులు నిషేదించారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు బుట్ట సంచులను, కాగితపు కవర్లను వాడాలని ప్రజలకు సూచిస్తున్నారు. అయితే ఆ నిషేధం పక్కగా అమలు అవుతుందా లేదా అనేది మాత్రం అధికారులు పట్టించుకున్న పాపాన పోవట్లేదు.
అధికారుల ఆదేశాలను అటు వ్యాపారులు, ఇటు వినియోగదారలు ఇద్దరు పెడచెవిన పెడుతున్నారు . ప్లాస్టిక్ వినియోగం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి పర్యావరణం ప్రమాదంలో పడుతున్న అధికారులు మాటల్లో తప్ప చేతల్లోకి దిగట్లేదు. అప్పుడు అప్పుడు అధికారులు హడావుడి చేసి ప్లాస్టిక్ కవర్లు విక్రయిస్తున్న వారిపై తీసుకుంటున్నామని చెబుతున్నా అది మాత్రం నామా మాత్రంగానే ఉంది.
వందల ఏళ్లు గడిచినా మట్టిలో కలిసిపోని ఈ ప్లాస్టిక్ పాలిధిన్ కవర్లు పర్యవరణానికి ప్రధాన శత్రువుగా మారింది. ప్లాస్టిక్ వినియోగం వల్ల భవిష్యత్ తరాలు మరింత ఇబ్బందులు పడనున్నారు. ప్లాస్టిక్ వాడకంపై ప్రభుత్వం 2006లోనే వీటిని నిషేధిస్తూ ప్రత్యేకంగా జీవో తెచ్చారు. అయితే ఆ జీవో జిల్లాలో ఎక్కడ అమలవుతున్న దాఖలాలు లేవు.
నిత్యం జిల్లా వ్యాప్తంగా వెయ్యి టన్నులకు పైగానే చెత్త సేకరణ జరగుతుంది. అయితే వీటిలో సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్ధాలే కనబడుతుంటాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు మట్టిలో కలవకపోవడంతో నీటిని భూమిలోకి ఇంకనీయకుండా అడ్డుపడుతుంటాయ్. దీంతో భూగర్బ జలాలు అట్టఅడుగుకు ఇంకిపోతున్న పరిస్ధితి ఏర్పడింది.
ప్లాస్టిక్ వినియోగం హానికరమని తెలిసినా, అనేక రకాల వ్యాధులకు కారణమని రుజువు అవుతున్నా ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని మానడం లేదు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా ప్లాస్టిక్ వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఎక్కడ చూసినా ప్రమాదకర ప్లాస్టిక్ సీసాలు, కవర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తూనే ఉన్నాయి. ప్లాస్టిక్ ప్రభావం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఆందోళన కలిగిస్తోంది.
ఇంటి నుంచి బయటకు వెళ్లడం మొదలు కొని తిరిగి ఇంటికి వచ్చే వరకు ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ ఇంటికి చేరుతోంది. దీని ద్వారా ప్రజారోగ్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్నప్పటికీ వాడకం ఏమాత్రం తగ్గక పోగా.. రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీన్ని అరికట్టాల్సిన అధికారులు నామమాత్రం చర్యలతో చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్లాస్టిక్ వాడకం వల్ల భూతాపం పెరుగుతుందని పలు అధ్యయనాలు నిగ్గుతేల్చాయి. ప్టాస్టిక్ క్యారీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రమాదకరమైన కార్సినోజన్లు శరీరంలో చేరి క్యాన్సర్కు దారితీస్తుందని, చర్య వ్యాధులు, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో మిగిలిన ఆహారం, కూరగాయల వ్యర్థాలు ఈ బ్యాగుల్లో వేసి చెత్తకుండీల్లో వేస్తున్నారు.
వీటిని మూగజీవాలు తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ భూమిపొరలో చేరి భూగర్భ కాలుష్యం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ కాల్చివేయడం వల్ల అందులోని రసాయనాలు వాతావరణంలో కలిసి మానవ, జీవరాశుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు కోరుతున్నారు. మున్సిపల్ అధికారులు కఠిన చర్యలకు పూనుకుంటే తప్ప పాస్టిక్ అమ్మకాలను కంట్రోల్ చేసే పరిస్ధితి కనబడట్లేదు.
వినియోగదారుల్లో కూడా తరుచు అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. ప్రతి నెలలో మూడో శనివారం స్వర్ణాంద్ర-స్వచ్చాంద్ర పేరుతో కాల్వలు క్లీన్ చేయడం, చెత్తను తరలించడం చేసే మున్సిపల్ అధికారులు, ప్లాస్టిక్ వినియోగం మీద కూడా అదేస్ధాయిలో దృష్టిపెడితే మెరుగైన ఫలితాలు వస్తాయి.